మనకా సత్తా ఉందా?

శ్రీకాళహస్తి గాలిగోపురం కూలిపోయిన నేపథ్యంలో కొంతమంది నాయకులు భిక్షమెత్తైనా సరే గోపురాన్ని తిరిగి నిర్మిస్తామని ఆవేశంగా ప్రతిజ్ఞలు చేసేశారు. వాటి సంగతలా ఉంచితే ఇంజనీరింగ్ లో మన పూర్వీకుల కన్నా బాగా అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న మనకు నిజానికి మన పూర్వీకుల కట్టడాలను యధాతథంగా పునరుద్ధరించే సత్తా ఉందా? అంటే నాకు ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది.

నేను వరంగల్ లో ఎంటెక్ చదివేటప్పుడు వేయిస్థంభాల గుడిని చాలా సార్లు సందర్శించాను. అది ఒకే డిజైన్ కలిగిన రెండు ఆలయాలు ఎదురెదురుగా ఉన్నట్లు నిర్మించబడి ఉంటుంది. ఒక్కో ఆలయం గోడలపై ఐదువందల స్థంభాలు చెక్కబడి ఉన్నాయి. కానీ వాటిలో ఒక భాగం నేను మొదట్లో అక్కడికి వెళ్ళినప్పుడే (2006 లో) శిథిలావస్థకు చేరుకున్నది. పురావస్తు శాఖ వారు ఎన్‌ఐటీ వరంగల్ లోని కొంత మంది సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ల సాయంతో ఆలయంలోని రాతి స్థంభాలకు ఏదో నంబర్లు వేసి కూల్చివేశారు. ఈ పనిలో చాలా రాతి స్థంభాలు దెబ్బతిన్నాయి కూడా.

ఇప్పటికి నాలుగేళ్ళు అవుతున్నా ఆలయ పునర్నిర్మాణాభివృద్ధిలో అతీ గతీ లేదు. దీన్ని మన పాలకుల నిర్లక్ష్యంగా అర్థం చేసుకోవాలో లేక మన ఇంజనీర్ల అసమర్థతగా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితిలో పర్యవేక్షణా లోపం వలన శ్రీకాళహస్తి గోపురం లాంటి మనకున్న అనేక ప్రాచీన కట్టడాలు కాలక్రమేణా చరిత్రలో కలిసిపోవడం తప్ప వేరే గత్యంతరం లేదనిపిస్తున్నది. ప్రభుత్వం వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దృష్టి సారిస్తే తప్ప ప్రాచీనమైన దేవాలయాలను కాపాడుకోలేం.

అయ్యో కూలిపోయింది…

శ్రీకాళహస్తి రాజగోపురం
శ్రీకాళహస్తి రాజగోపురం

మా ఊరు శ్రీకాళహస్తికే తలమానికంగా నిలిచిన రాజగోపురం నిట్ట నిలువునా కూలిపోయింది. 1516 సంవత్సరంలో గజపతులపై విజయానంతరం  శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని విజయోత్సవ చిహ్నంగా శ్రీకృష్ణ దేవరాయలు ఈ గోపురాన్ని  నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఏడు అంతస్తులతో 135 అడుగుల ఎత్తు గలిగిన ఈ గాలిగోపురం ఉన్న పళంగా కూలిపోవడానికి మాత్రం ఖచ్చితమైన కారణాలు తెలియరావడం లేదు. గోపురంలో చీలికలు ఏర్పడ్డట్టు కొన్ని రోజుల ముందే కొన్ని టీవీ చానళ్ళు కథనాలు ప్రసారం చేయడంతో అధికారులు అప్రమత్తమై ఆర్కియాలజీ నిపుణుల్ని పిలిపించారు. వారు ఆ చీలికలను పరిశీలించి గోపురం చుట్టూ 150 మీటర్ల దూరం వరకు డేంజర్ జోన్ గా ప్రకటించారు. చుట్టు పక్కలా ఉన్న ప్రజల్ని తమ నివాసాల్ని ఖాళీ చేయించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

గోపురంలో ఇంతకు ముందే పగుళ్ళున్నప్పటికీ ఇటీవల సంభవించిన లైలా తుఫాను ధాటికి సమస్య మరింత తీవ్రమైనట్లు తెలుస్తోంది. సాధారణంగా గోపురంపై పక్షులు నివాసముండటం వల్ల వాటి రెట్టల వల్ల గోపుర పై భాగంలో అక్కడక్కడా చెట్లు మొలుస్తాయి. వాటిని ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాల సమయంలో తొలగిస్తుంటారు. వీటి వల్ల కూడా చీలికలు వచ్చి ఉంటాయని కొంతమంది భావిస్తున్నారు.

అలవాటు ప్రకారం ప్రతిపక్ష నాయకులు అధికారులపై, ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నా నిర్మాణం 450 సంవత్సరాల క్రితంది కావటం, మట్టితో నిర్మించడం, తుఫాను ప్రభావం మొదలైన ఎన్నో కారణాలున్నాయి. టీవీలు ప్రసారం చేసిన కథనాలకు వెంటనే స్పందించిన అధికార గణం, ఆలయ అధికారుల అప్రమత్తత వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడ గలిగాయన్నది నిర్వివాదాంశం.

మరి ఉన్న చోటనే మళ్ళీ గాలిగోపురం నిర్మిస్తారో, లేక అలానే వదిలేస్తారో ఆ శ్రీకాళహస్తీశ్వరునికే తెలియాలి.

కొంటె ప్రశ్నలు – తుంటరి సమాధానాలు

నేను ఐదారు తరగతుల్లో ఉన్నప్పటి సంగతి. పిల్లకాయలం అందరం రోజూ ఉదయం చెరువులోకి వెళ్ళి తిరిగొస్తూ దారి మధ్యలో పేపర్ చదవడం కోసం ఒక రైస్‌మిల్లు దగ్గర ఆగేవాళ్ళం. పేపర్ అంటే మాకు కేవలం ఆటల పేజీనే… క్రికెట్ అంటే అంత పిచ్చి మాకు.

అక్కడ మాలాంటి వాళ్ళను ఆటపట్టించడం కోసం ఒకాయన కూచొని ఉండేవాడు. ఆయన భలే సరదా మనిషి. మేం వెళ్ళి పేపర్ దగ్గర కూర్చోగానే మమ్మల్ని కొన్ని ప్రశ్నలడిగేవాడు.అవి ఎలా ఉండేవంటే

“ఒరేయ్… మీరు చదువుకున్న వాళ్ళైతే నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండ్రా”

“రాయి నీళ్ళలో వేస్తే ఎందుకు మునిగిపోతుంది?”

“ఆ మాత్రం మాకు తెలీదా… రాయి బరువు గా ఉండటం వల్ల మునిగిపోతుంది” అనేవాళ్ళం.

“ఓస్ ఇంతేనా మీకు తెలిసింది? చేప బరువుగా ఉంది కదా మునిగిపోతుందా? కాదు కదా. రాయి మునిగిపోయింది ఈత రాకపోవడం వల్ల” అని తేల్చేవాడు.

హ్మ్మ్ సరే.. ఇంకో ప్రశ్న అడుగుతాను దీనికైనా సరైన సమాధానం చెప్పండి చూద్దాం.

“చెరువులో నీళ్ళు ఎట్టా ఉంటాయి?”

దానికి మేము తెల్లగా ఉంటాయని ఒకడు, బురదగా ఉంటాయని ఒకడు ఇలా ఎవరికి తోచిన సమాధానం వాళ్ళం చెప్పేవాళ్ళం.

ఆయన మాత్రం “ఓర్నీ ఇంతేనా మీకు తెలిసింది. చెరువులో నీళ్ళు గట్టు వేస్తే ఉంటాయి” అనే వాడు.

సరే ఇంకో ప్రశ్న “దారిన పోయే మనిషి ఎట్టుంటాడు?”

మేం ఏం చెప్పినా దానికి కౌంటర్ ఏస్తాడని మేం గమ్మునే ఉండిపోతే…

“మీ అయ్యోర్లు మీకు ఏం పాఠాలు జెప్తాఉండారో ఏమో… ఒక్క ప్రశ్నక్కూడా కరట్టుగా జవాబు చెప్పలేకుండా ఉన్నారు. నేం జెప్తా జూడు”

“దారిన పోయేవాణ్ణి ఉండమంటే ఉంటాడు. ఇది కూడా తెలీదు. ఏం జదవతుండార్రా మీరు!”

అలాంటిదే ఇంకో ప్రశ్న అడిగేవాడు.

“ఒక రైలు పది గంటలకు కాళాస్తిర్లో బయల్దేరింది. పన్నెండు గంటలప్పుడు అది ఎక్కడ వెళుతుంటుంది?”

మేం మధ్యలో ఉండే ఊర్లు పేర్లు ఏదేదో చెప్పేవాళ్ళం. ఆయన మాత్రం “దానిగ్గూడా అంత ఆలోచిస్తుండారేంది మీరు? దానికోసం అంత ఆలోచించ బళ్ళే…
పన్నెండు గంటలప్పుడు అది పట్టాల మీద బోతా ఉంటది” అనేవాడు.

మళ్ళీ ఎప్పుడు కనిపించినా ఇలాంటి ప్రశ్నలు అడిగేవాడు. ఒక్కోసారి మళ్ళీ “రాయి నీళ్ళలో వేస్తే ఎందుకు మునిగిపోతుంది?” అని అడిగేవాడు.

అప్పుడు గానీ ముందుగా ఆయన సమాధానం గుర్తు బెట్టుకుని “రాయికి ఈత రాక మునిగిపోయింది” అన్నామనుకో ఇంకా గట్టిగా నవ్వేసేవాడు

“ఒరే పిచ్చోడా! రాయికి ఏడైనా ఈతొస్తుందటరా…” అనేవాడు.

ఇంక ఈయన్తో మనకెందుకులే అని మా పిల్ల గ్యాంగంతా సాధ్యమైనంతవరకు తప్పించుకుని తిరిగేవాళ్ళం.

వేటూరి అవార్డు పాటలు ఒకే చోట వినండి.

వేటూరి పరమపదించిన సందర్భంగా అవార్డులకే వన్నె తెచ్చిన ఆయన పాటలు ఒక చోట చేరుద్దామని ఈ చిన్న ప్రయత్నం వినండి. ఆయనకు మొత్తం ఎనిమిది నంది అవార్డులు, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాటకు జాతీయ అవార్డు వచ్చాయి. ఈ 9 పాటల్ని పక్కన ఉన్న బాక్స్.నెట్ విడ్జెట్ లో వినవచ్చు. పాటను వినడానికి ఈ లింకు మీద నొక్కండి.

  1. మానసవీణ మధుగీతం – పంతులమ్మ
  2. శంకరా నాద శరీరా పరా – శంకరాభరణం
  3. బృందావని ఉంది – కాంచనగంగ
  4. ఈ దుర్యోధన దుశ్శాసన – ప్రతిఘటన
  5. పావురానికి పంజరానికి – చంటి
  6. ఆకాశాన సూర్యుడుండడు – సుందరకాండ
  7. ఓడను జరిపే ముచ్చట కనరే – రాజేశ్వరి కల్యాణం
  8. ఉప్పొంగెలే గోదావరి – గోదావరి