విద్యాసాగరుని త్యాగం

బెంగాల్ కు చెందిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన విద్యా సంపద, దయాగుణం చూసి అచ్చెరువొందని వారు లేరంటే అతిశయోక్తి కాదు. బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ప్రముఖ పాత్ర పోషించారాయన.

అప్పట్లో ఆయన బ్రిటీష్ ప్రభుత్వం నిర్వహించే ఒక సంస్కృత కళాశాలలో సంస్కృతం బోధించేవారు. ఒకసారి ఆ సంస్థలో ఒక ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఖాళీ ఏర్పడింది. ఆ ప్రిన్సిపల్ అందుకు విద్యాసాగర్ సరైన వ్యక్తి అని అనుకున్నాడు. కానీ విద్యాసాగర్ అందుకు ఒప్పుకోలేదు.

ఆ ప్రిన్సిపల్ ఎందుకని అడిగాడు.

“ఎందుకంటే నా కంటే సంస్కృతం బాగా తెలిసిన వారు ఇంకొకరున్నారు. ఈ పదవికి వారే అర్హులు” అన్నారు.

అప్పుడా ప్రిన్సిపల్ “చూస్తుంటే బతకనేర్చిన వాడిలా లేవు. నీకు డబ్బు అవసరమా? లేదా? నీవు పెద్ద కుటుంబాన్ని పోషించాలని గుర్తుంచుకో. మీ సహోదరులు నీమీదనే ఆధారపడి ఉన్నారు. నాకు నీ మీద ఎనలేని విశ్వాసం, గౌరవం ఉన్నాయి. కాబట్టి ఈ పదవిని నువ్వే స్వీకరించాలి” అన్నాడు.

అయినా విద్యాసాగరుడు తన పట్టు వదల్లేదు. “నాకన్నా ఎక్కువ పరిజ్ఞానం గలవారు ఇంకొరున్నారు. ఆయన సాక్షాత్తూ మా గురువులు” అన్నాడు.

“నీతో నేను అంగీకరించలేను” అన్నాడు ఆ ప్రిన్సిపల్.

“మీరెన్ని చెప్పినా సరే, నాకు మాత్రం ఆ పదవి స్వీకరించడం ఇష్టం లేదు” అన్నాడు విద్యాసాగర్.

“సరే! ఆ పదవికి ధరఖాస్తు చెయ్యాలంటే ఎల్లుండి దాకే సమయముంది. మీ గురువు గారు అందుకు అప్లై కూడా చేయలేదు. లేకపోతే దాన్ని అధికారికంగా గుర్తించలేము ” అన్నాడు.

“అలా అయితే నేనే మా గురువు గారింటికి వెళ్ళి అప్లికేషన్ తీసుకు వస్తాను” అన్నాడు విద్యాసాగర్.

సుమారు యాభై మైళ్ళ దూరంలో ఉన్న ఆయన గురువు గారి దగ్గరకు వెళ్ళాలంటే విద్యాసాగర్ కొన్ని గ్రామాలు దాటి వెళ్ళాలి.  దాన్ని దాటాలంటే ఎద్దుల బండి ఉండాలి. లేకపోతే నడకే శరణ్యం. ఆయన విద్యా సంపన్నుడు, దయా సంపన్నుడేకానీ శారీరక బల సంపన్నుడు కాదు. ఆయనికి అంత దూరం నడవాలంటే నిజంగా కష్ట సాధ్యమైన పనే. ఆ రోజు మధ్యాహ్నమే బయలు దేరి మరుసటి రోజుకు వారి గురువుగారిల్లు చేరాడు. గురువు గారు విద్యాసాగర్ ఎందుకోసం వచ్చాడో తెలుసుకోగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆయన్ని ఒక్కసారిగా గట్టిగా కౌగలించుకున్నాడు.

“భగవంతుడు కరుణా సముద్రుడయ్యా! నువ్వు నా మీద కరుణతో అంత దూరం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నడిచి వచ్చావు. పేరులోనే ఈశ్వరుణ్ణి పెట్టుకున్నావు. సాక్షాత్తు భగవత్స్వరూపుడివయ్యా నీవు” అని ఆశీర్వదించాడు.

విద్యాసాగర్ ఆ అప్లికేషన్ ని నింపి, గురువు గారి చేత సంతకం చేయించుకున్నాడు. మళ్ళీ యాభై మైళ్ళు వెనక్కి నడిచి తన గ్రామాన్ని చేరుకునే సరికి బాగా అలిసిపోయాడు. కానీ తన గురువు గారికి ఉద్యోగం లభిస్తుందన్న ఆనందం మాత్రం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ ప్రిన్సిపల్ మాత్రం కుర్చీ లో కూర్చుని మారు మాట్లాడలేకపోయాడు. అసలీ విద్యాసాగర్ లాంటి మనుషులు ఈ భూమ్మీద ఇంకా ఉన్నారా? అని ఆశ్చర్యపోయాడు.

అప్పట్నించీ విద్యాసాగర్ కి నెలకి యాభై రూపాయలు లభిస్తే ఆయన గురువు గారికి తొంభై రూపాయాలు లభించేది.

ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గురించి వికీపిడియా లో ఇక్కడ చదవండి.