శ్రీరామకృష్ణ పరమహంస యొక్క సన్యాసాశ్రమ శిష్యుల జీవితాల గురించి స్వామి చేతనానంద రాసిన పుస్తకం ఇది. ఒక మిత్రుని ద్వారా నా దగ్గరకు వచ్చింది. శ్రీరామకృష్ణులతో స్వామీ వివేకానంద తో సహా మరో పదిహేను మంది ప్రత్యక్ష శిష్యుల అనుభవాల సారమే ఈ పుస్తకం. ఈ పుస్తకం చదవక ముందు నాకు కేవలం వివేకానంద గురించి మాత్రమే తెలుసు. కానీ మిగతా పదిహేను మంది కూడా ఏమాత్రం తీసిపోని వారు. వీరిలో బాగా చదువుకున్న వారి దగ్గర్నుంచి కేవలం అక్షర జ్ఞానం లేని వాళ్ళు, సంసారం నుంచి బయటపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు.
నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు, వ్యాసాలు బాగా చదివే వాడిని. కానీ కొంచెం పరిపక్వత వచ్చాక అవి రుచించడం మానేశాయి. ఎందుకంటే వాటిలో ఉండే విషయాలు చాలావరకు ఉపదేశ ధోరణి లో ఉండటమే. ఇవి చదివినంత సేపు బాగానే ఉన్నా ఆచరణలో పెట్టాలంటే కష్టంగా ఉండేది. అప్పుడే శ్రీకాళహస్తి శాఖా గ్రంథాలయంలో కొంతమంది ప్రముఖుల జీవితాల్ని చదవడం ద్వారా కొంత స్ఫూర్తి పొందాను. మనసు కొంచెం ఆధ్యాత్మిక జీవనం వైపు మొగ్గాక ఈ పుస్తకం చదవడం ప్రారంభించాను. ఎందుకంటే ఈ పుస్తకంలో రాసిందంతా శ్రీరామకృష్ణుల శిష్యులు తమ జీవితంలో ఆచరించి చూపించిన విలువలే. నిజజీవిత సంఘటనలు చదివితే అరే వాళ్ళు అలా ఆచరించి చూపించినపుడు మనం కూడా అలా ఎందుకు ఉండకూడదు? అని స్ఫూర్తి నిస్తుంది కదా!
ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో విచిత్రమైన గాథ. అందరూ విరుల తావికి ఆకర్షించబడిన తుమ్మెదల్లాగా భగవత్ జ్ఞానం కోసం శ్రీరామకృష్ణుని చేరిన వారే. వీళ్ళ గురించి చదివే దాకా సన్యాసం అంటే సమాజంతో సంబంధం లేకుండా తమ లోకంలో తాము బతకడమన్న అభిప్రాయం ఉండేది నాకు. కానీ వీరు మాత్రం సన్యాసాశ్రమం స్వీకరించిన తరువాత కూడా గురువు యొక్క బోధనలను వ్యాప్తి చేయడానికి, వైదిక ధర్మ ప్రాశస్త్యాన్ని వివరించడానికి దేశ విదేశాలు పర్యటించారు. కేవలం గురువాజ్ఞ కోసం నానా కష్టాలు పడ్డారు. పేదరికాన్ని చూసి చలించిపోయారు. మానవ సేవను తమ జీవితాల్లో ప్రధాన భాగం చేసుకున్నారు.
రామకృష్ణులకు ప్రియమైన శిష్యులంతా కారణ జన్ములే. వీళ్ళందరూ పూర్వ జన్మలో ఎవరో రామకృష్ణులు ఏదో ఒక సందర్భంలో తెలియజేశారు. శిష్యులను ఎవరి తత్వానికి తగ్గట్టు వారికి శిక్షణ ఇచ్చేవాడు. మంచి చదువరులైతే జ్ఞానమార్గం, అంతగా చదువులేని వారికి భక్తిమార్గం ద్వారా ఉపదేశం చేశాడు. అలాగే సన్యాసాశ్రమ శిష్యులకు బోధించేటపుడు గృహస్థులకు దగ్గరకు కూడా రానిచ్చేవాడు కాదు.
రామకృష్ణులు మరణ శయ్య మీద ఉన్నప్పుడు ఓ సారి స్వామీ వివేకానంద ఆయనకు దగ్గర్లోనే కూర్చున్నాడు. రామకృష్ణులు గొంతు క్యాన్సర్ వల్ల విపరీతమైన బాధతో ఉన్నారు. వివేకానంద మనసులోనే ఇలా అనుకున్నాడు. “మీరే భగవంతుని ఇప్పుడైనా ప్రకటించగలిగితేనే నేను మీరు నిజంగా ఆ పరమాత్మయే అని నమ్ముతాను.” వెంటనే శ్రీ రామకృష్ణులు వివేకానంద వైపు చూసి
“ఎవరైతే రాముడిగా, కృష్ణుడిగా వచ్చాడో వారిద్దరే ఇప్పుడు శ్రీరామకృష్ణుడిగా ఈ శరీరంలో ఉన్నాడు” అని ప్రకటించాడు. వెంటనే వివేకానందకున్న భ్రమలన్నీ కరిగిపోయాయి.
అలాగే నరేంద్రుడి (వివేకానంద) జననం ముందు కూడా రామకృష్ణులకు లీలామాత్రంగా ఓ దృశ్యం గోచరించింది. ఒక రోజు రామకృష్ణులు సమాధి స్థితిలో ఉండగా ఆయన మనసు ఓ వెలుగు రేఖల వైపు ప్రసరిస్తూ వెళుతోంది. ఆయనకిరువైపులా అనేక దేవతా మూర్తులు గోచరిస్తున్నాయి. అలా సాగుతూ దేవతా మూర్తులనూ, అన్నీ అంతరాలన్నీ దాటుకుంటూ ఓ శూన్యమైన స్థితికి చేరింది. వెంటనే ఆయనకు సప్తర్షులు కనిపించారు. ఈ రుషులు తమ తపశ్శక్తితో కేవలం మానవులనే కాక దేవుళ్ళను కూడా అధిగమించినట్లు ఆయనకు అనిపించింది. అలా చూస్తుండగా కొన్ని వెలుగు రేఖలు కలిసి ఒక దివ్యమైన స్వరూపం కలిగిన బాలుడిగా రూపుదిద్దుకొన్నాయి. ఆ బాలుడు నెమ్మదిగా వచ్చి సప్తర్షులలో ఒకరి దగ్గరకు వచ్చి మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా పిలుస్తూ సమాధి స్థితి నుంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ అధ్బుతమైన స్పర్శ తగలగానే ఆ రుషి నెమ్మదిగా కళ్ళు తెరిచి అర్ధ నిమీలిత నేత్రాలతో ఆ బాలునివైపు చూశాడు. ఆ బాలుడు పరమానందభరితుడై ఆ రుషితో ఇలా అన్నాడు “నేను కిందకు వెళుతున్నాను. మీరు కూడా నాతో పాటు రావాలి.” ఆ రుషి మౌనంగా ఉండి పోయాడు. కానీ ఆయన చిరునవ్వే అంగీకారంగా తోచింది. నరేంద్రుడు తన దగ్గరకు రాగానే రామకృష్ణులకు ఆ ఋషే గుర్తుకు వచ్చాడు.
తరువాత ఆ దివ్యశిశువు తనేనని కూడా ప్రకటించాడు.
మరో శిష్యుడు రాఖల్ (బ్రహ్మానంద) రాక మునుపు ఆయనకు కాళికా దేవి స్వప్నంలో సాక్షాత్కరించి ఆయన ఒళ్ళో ఒక బిడ్డనుంచి “ఇదిగో మీ అబ్బాయి” అన్నది. ఆయన ఆశ్చర్యపడి “ఏవంటున్నావ్ తల్లీ! నాక్కూడా సంతానమా?” అని అడిగాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ “దైవిక సంతానమేలే!” అన్నది. అంతతో ఆయన సంతృప్తి పడ్డాడు. రాఖల్ ఆయన దగ్గరకు రాగానే అతన్ని కాళికా దేవి వరప్రసాదంగా గుర్తించాడు. రాఖల్ గురించే ఇంకో సారి మరో దృశ్యం సాక్షాత్కరించింది. ఇద్దరు బాలురు గంగానదిపై వికసించిన ఓ పెద్ద కమలంపై నాట్యమాడుతున్నారు. ఒకరేమో శ్రీకృష్ణ పరమాత్మ. మరొకరు కాళికాదేవి తన ఒడిలో ఉంచిన పసిపాపడిగా గుర్తించాడు. రాఖల్ జన్మ వృత్తాంతాన్ని గురించి ఇతర శిష్యులకు చెబుతూ శ్రీరామకృష్ణులు “రాఖల్ కు తన నిజ స్వరూపం తెలిసిన మరుక్షణం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండబోడు. అంతలోపు అతను నిర్వర్తించాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని అతనికి తెలియకుండా గోప్యంగా ఉంచండి.” అని చెప్పాడు.
సన్యాసులైనా వారి జీవితం కూడా సుఖదుఃఖాలకు కోప తాపాలకూ అతీతమేమీ కాదు. అయితే వారు అలాంటి వాటిని ఎలా పరిష్కరించుకున్నారో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఒకరి మీద ఒకరికి కోపం వచ్చిన కేవలం కొద్ది సేపు మాత్రమే. తర్వాత ఎంతో ప్రేమగా కలిసిపోయేవారు. తమ వ్యక్తిత్వాన్ని మలచడానికి, సాధన సక్రమమైన మార్గంలో పెట్టడానికి గురువు తమ పట్ల కఠినంగా ప్రవర్తించినా ప్రేమగా అర్థం చేసుకున్నారు.
గురువు గారు పరమపదించిన తర్వాత కనీసం తినడానికి తిండి లేకపోయినా సన్యాసం నుంచి పారిపోలేదు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా తమ గురువు మీద అచంచలమైన విశ్వాసంతో కేవలం ఒక్కపూట భోజనం తిని, లేదా రోజుల తరబడి పూర్తి ఉపవాసాలున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత రామకృష్ణులు తన గృహస్థాశ్రమ శిష్యుడైన సురేంద్ర నాథ్ మిత్రాకు కలలో కనిపించి తన శిష్యుల పరిస్థితి గురించి చెప్పి వారికి ఏదో దారి చూపించమన్నాడు. ఆయన కొంత నెల నెలా కొంత ధన సహాయం చేయడంతో ఒక పాడుబడ్డ బంగళాను అద్దెకు తీసుకుని అందులో తమ సాధనను కొనసాగించారు.
రామకృష్ణులు తన శిష్యుల్ని పరీక్షించినట్టే శిష్యులు కూడా తమ గురువును అంతకంటే ఎక్కువగానే పరీక్షించారు. ఒక్కోసారి కావాలనే భిక్షకు వెళ్ళకుండా “మా గురువు సదా మా అండగా ఉండేది నిజమే అయితే ఆయనే మాకు భోజనం సమకూర్చుగాక!” అనుకుంటూ కూర్చుంటే ఏదో విధంగా వారికి తినడానికి ఏదో ఆహారం దొరికేది. కాలినడకన దేశమంతా యాత్రలు చేస్తూ అడవుల్లో, పర్వతాల్లో దారి తప్పిపోయినప్పుడల్లా గురువు మీద భారం వేసి నడుస్తూ వెళుతుంటే ఏదో జనావాసాలను చేరుకునే వారు. ఇలా జరిగినప్పుడల్లా వారికి గురువుపై విశ్వాసం రెట్టింపయ్యేది.
గురుసేవలో వారు ఎంత తరించిపోయారంటే ఆయన పరమపదించిన తర్వాత కూడా బతికున్నప్పుడు ఎలాగైతే సేవలు చేసేవారో అలాగే సేవలు చేసేవారు. ఆయనకిష్టమైన ఆహారపదార్థాల్ని వండిపెట్టేవారు. ఆయన పడుకున్న పడకను శుభ్రంగా ఉంచేవారు. విసనకర్రతో విసురుతూ నిద్రపుచ్చేవారు. ఇలా రామకృష్ణుల సేవలో తరించిపోయిన శశి కి వివేకానంద తర్వాత రామకృష్ణానంద అని నామకరణం చేశాడు.
ఇలా ఈ పుస్తకంలో ఎన్నో సంఘటనలు నన్ను కదిలించాయి, ప్రభావితం చేశాయి. ఒక పుస్తకం చదివాక అందులో విషయాలు మనకు ఎంతకాలం వరకు మళ్ళీ గుర్తుకు వస్తాయో, ఎన్ని సార్లు మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుందో దాన్ని బట్టి పుస్తకం గొప్పతనాన్ని అంచనా వెయ్యొచ్చు. అలా ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోయే పుస్తకం!