వెంకటగిరి సంస్థానం గురించిన ఆసక్తికరమైన కథ

ఈ మధ్యన నేషనల్ డిజిటల్ లైబ్రరీలో చరిత్ర పుస్తకాల కోసం వెతుకుతుంటే నానారాజన్య చరిత్రము అనే ఒక పుస్తకం దొరికింది. ఈపుస్తక రచయిత శ్రీరామ్ వీరబ్రహ్మం. 1918లో ప్రచురించారు. ఈ పుస్తకంలో వెంకటగిరి సంస్థానం గురించే కాక మరో పద్నాలుగు సంస్థానాల గురించిన చరిత్ర ఉంది. వెంకటగిరి సంస్థానం గురించి చదువుతుండగా నాకు మా పెద్దవాళ్ళ ద్వారా విన్న ఓ ఆసక్తికరమైన కథకు ఆధారం దొరికింది. ఇది వెంకటగిరి సంస్థానం గురించి నేను చిన్నప్పటి నుంచి వింటున్న కథ.

************

నిజాం కాలంలో పద్మనాయక వంశానికి చెందిన చెవిరెడ్డి అనే రాజు ఉండేవాడు. అప్పటి నైజాం రాజ్యంలోని నల్లగొండ మండలం లోని ఆమనగల్లు రాజధానిలోనూ, పిల్లలమఱ్ఱి అనే రాజధానిలోనూ నివసిస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఈయనకు పూర్వము పదవతరం వాడైన హేమాద్రి రెడ్డి అనే రాజు పరిపాలనలో బాగా ధనాన్ని సంపాదించి దాన్ని ఒకచోట నిక్షేపించాడు. దానిపైన ఒక వేదిక కట్టించి ఒక మర్రి చెట్టును నాటాడు. దానికింద ఒక భైరవ విగ్రహాన్ని ప్రతిష్టించి ఒక కోరిక కోరుకున్నాడు.

“స్వామీ! మీరీ సంపదను కాపాడి, నా సంతతిలో అత్యంత ధైర్య సాహసాలు కలిగిన వాడు, సత్కర్మలు చేయగల వాడు, సద్గుణ సంపన్నుడు అయిన వానికి అందజేయవలెన” ని దాని సారాంశం.

ఇది తెలియపరచడానికి రహస్యముగా ఒక శిలాశాసనాన్ని కూడా స్థాపించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చెవిరెడ్డి ఒకసారి వేటకోసమని ఆ ప్రాంతానికి వచ్చాడు. అదే సమయంలో వారి దివాణంలో పనిచేసే రేచడు అనే హరిజనుడు వ్యవసాయం చేయడం కోసం పొలం దున్నుతుండగా నాగలికి ఏదో అడ్డం పడింది. అది పూర్వం హేమాద్రి రెడ్డి చెక్కించిన రహస్య శిలా శాసనం. అదే సమయానికి తమ రాజు అటువైపు వెళుతుండగా రేచడు ఆయన దగ్గరకు వెళ్ళి ఆ శాసనం గురించి చెప్పాడు.

శాసనాన్ని చదివిన చెవిరెడ్డి తన పూర్వీకులు దాచిన నిధిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా, దాని ప్రక్కనే ఉన్న మర్రి చెట్టును ఆశ్రయించుకున్న భేతాళుడు ఈయన ధైర్యాన్ని పరీక్షించాలనుకున్నాడు. తన మాయలతో మేఘాలు, ఉరుములు, మెఱుపులు సృష్టించి ఆ మర్రి చెట్టు వారిపై పడేలా చేశాడు. రేచడు ఇది చూడగానే మూర్ఛపోయినాడు. కానీ చెవిరెడ్డి మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. భేతాళుడు ఇతని శక్తిని మరింతగా పరీక్షించదలచి భీకరరూపంతో చెవిరెడ్డి ముందుకు దూకాడు. అంత ఆ రాజు తన కత్తి దూసి నరకబోతుండగా భేతాళుడు నిజరూపంలో ప్రత్యక్షమై అతని ధైర్య సాహసాలకు మెచ్చాననీ ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అపుడా రాజు తమ వంశం వారంతా రాజ్యభోగాలతోనూ, శౌర్య ధైర్యాధి గుణములను కలిగి ఉండేలాగుననూ, తాము యుద్ధానికి వెళ్ళేటపుడు భేతాళుడు ముందు నడిచేలా వరాలను కోరుకున్నాడు. భేతాళుడు ఆ వరాలను అనుగ్రహించి అంతర్థానం అయ్యాడు.

తర్వాత ఆ రాజు ఆనందంతో ఆ సంపదను వెలికితీయడానికి ప్రయత్నించగా, పక్కనే భైరవమూర్తి నుంచి అశరీరవాణి ఒకటి వినిపించింది.

“ఓ రాజా, నీవు ఈ సంపదను తీసుకోవడానికి అర్హుడవే కానీ, ఈ సంపదను కొన్ని క్షుద్ర భూతములు ఆశించి ఉన్నాయి. వాటికి ఒక నరబలి ఇచ్చి ఈ సంపదను తీసుకుంటే నీకు మంచి జరుగుతుంది” అని పలికింది.

రాజు నరహత్యకు వెనుకాడుతూ ఆలోచిస్తుండగా మూర్ఛ నుంచి తేరుకున్న రేచడు జరిగిన విషయం తెలుసుకుని తనను బలి ఇచ్చి ఆ ధనాన్ని తీసుకోమన్నాడు. కానీ ఆ రాజుకి తన దివాణంలో నమ్మకస్తుడైన అతనిని బలి ఇవ్వడానికి మనసొప్పలేదు. అప్పుడు రేచడు “మీరు ఈ ధనాన్ని మంచి కోసమే వినియోగించగలరని నాకు నమ్మకం ఉంది. కాబట్టి నేను కోరిన కోరికలు తీర్చి నన్ను బలి ఇస్తే మీకు నరహత్య పాపం అంటదు.” అన్నాడు. దాంతో రాజు రేచడు కోరినట్లు తమ వంశం వారినందరినీ తరతరములకు రాజా వారి వంశీయులు పోషించుటకు, తమకు వివాహం జరిగేటపుడు రేచని వంశీయులకు వివాహం జరిగేలా అంగీకరించి వానిని బలియిచ్చి ధనాన్ని స్వీకరించాడు. భేతాళుని కారణముగా ఈయనకు భేతాళ నాయడనని కూడా పేరు.

వెంకటగిరి రాజుల పేర్ల వెనుక యాచేంద్ర అని చేర్చుకుంటారు. ఉదాహరణకు ఇటీవలి తరానికి చెందిన వారి పేర్లు గోపాలకృష్ణ యాచేంద్ర, సాయికృష్ణ యాచేంద్ర. ఈ రేచడి పేరే తర్వాతి తరంలో యాచమ నాయుడనీ, యాచేంద్ర అనీ రూపాంతరం చెంది ఉండవచ్చని నా ఊహ.

తెలివైన ఇంద్రజాలికుడు – పిల్లల కథ

ఒకానొక ఊర్లో ఎలుకలు బాగా ఎక్కువైపోయాయి. రైతులు కష్టపడి పండించి గోదాముల్లో దాచుకున్న ధాన్యం అంతా ఎలుకల పాలు అవసాగింది. అదే సమయంలో ఆ గ్రామానికి ఓ ఇంద్రజాలికుడు వచ్చాడు. ఆ గ్రామ పెద్ద వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పాడు. అప్పుడు ఆ ఇంద్రజాలికుడు తాను ఆ సమస్యను పరిష్కరిస్తాననీ దానికి పారితోషికం ఏదైనా కావాలని కోరాడు. గ్రామస్తులంతా ఇంటికో బస్తా చొప్పున ధాన్యం ఇస్తామని ఒప్పుకున్నారు.

దానికా ఇంద్రజాలికుడు సంతోషించి తన దగ్గరున్న వేణువుతో ఓ రాగం మొదలు పెట్టాడు. ఆ రాగం వినగానే ఎక్కడెక్కడో నక్కి ఉన్న ఎలుకలన్నీ అతని వెంట పడటం ప్రారంభించాయి. అతనలా వాయిస్తూ నెమ్మదిగా నడక సాగిస్తుంటే ఎలుకలు కూడా అతనిని వెంబడించడం ప్రారంభించాయి. అతనలా వాయించుకుంటూ నెమ్మదిగా దగ్గరున్న నదిలోకి ప్రవేశించాడు. ఆ ఎలుకలు కూడా ఆ నదిలోకి దూకడంతో అన్నీ ప్రవాహ వేగానికి కొట్టుకొని పోయాయి.

ఎలుకల పీడ విరగడైనందుకు గ్రామస్తులంతా ఎంతో సంతోషించారు. చివరికి అతనికి పారితోషికం ఇచ్చే సమయం ఆసన్నమైంది. అప్పుడే గ్రామస్తులకు దుర్బుద్ధి పుట్టింది. ఇతను కేవలం వేణువు వాయించినందుకే మనం ఎందుకంత పారితోషికం ఇవ్వాలి. ఏదో ఒకటో రెండో బస్తాలు ధాన్యం ఇచ్చి పంపేద్దాం అనుకున్నారంతా కలిసి. దానికి ఇంద్రజాలికుడు ససేమిరా ఒప్పుకోలేదు. అయితే నీకు అసలేమీ ఇవ్వం. ఏం చేసుకుంటావో చేసుకో అన్నారంతా కలిసి. అప్పుడతనికి కోపం వచ్చి తన దగ్గరున్న వేణువు తీసి మరో రాగం ఆలపించసాగాడు. దాంతో ఆ ఊర్లో ఉన్న పిల్లలంతా మంత్రించినట్టుగా అతని వెంటపడసాగారు. అతను నెమ్మదిగా వాళ్ళనందరినీ నది వైపు తీసుకువెళ్ళ సాగాడు. గ్రామస్తులు తమ పిల్లలందరినీ కూడా నదిలో ముంచేస్తాడేమోనన్న భయంతో అతన్ని ఆపి అతనికి రావలసిన పారితోషికాన్నిచ్చి పంపించేశారు.

రూపాయీ రూపాయీ నువ్వేం చేస్తావు?

ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో రొప్పుతూ వస్తూ కనిపించాడు. వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి “ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నారు?” అని అడిగారు.
అందుకాయన “అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది.”
వాళ్ళిద్దరూ భయంతో “అంటే అక్కడ పులి ఉందా?” అని అడిగారు.

“కాదు. కానీ దానికన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది బయటపడింది.” అన్నాడాయన.
“ఇంతకీ ఏమిటది?” అని అడిగారు వాళ్ళిద్దరూ కంగారుగా.
“బంగారు నాణేల గుట్ట” అన్నాడు సన్యాసి.
వాళ్ళిద్దరూ సంతోషంగా ముక్తకంఠంతో “ఎక్కడ?” అని అడిగారు.
“అదిగో ఆ పొదల్లోనే” అని వేలు చూపించి చక్కా తన దారిన పోయాడా సన్యాసి.
వాళ్ళిద్దరూ ఆ వేపు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బంగారు నాణేలు కనిపించాయి.
“ఈ సన్యాసులెంత మూర్ఖులు? నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేమిటి?” అన్నాడొక మిత్రుడు.
“ఆయనంటే అన్నాడులే. ముందుగా ఇప్పుడేం చేద్దామో ఆలోచిద్దాం. పట్టపగలే బహిరంగంగా దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది. మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం. మరొకరు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకు వద్దాం.” అన్నాడు మరో మిత్రుడు.
అనుకున్నట్టే ఒక మిత్రుడు బంగారానికి కాపలాగా ఉండి రెండోవాణ్ణి ఊర్లోకి పంపించాడు.

ఈలోగా మొదటి వాడు ఇలా అనుకున్నాడు.
“ఛ. ఈ రోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది. బంగారం కూడా మరీ ఎక్కువగా లేదు. నా కుటుంబం చాలా పెద్దది. దాన్ని పోషించడానికి ఈ బంగారం అంతా నాకే దక్కితే బాగుంటుంది కదా! వాడు వచ్చీ రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను. ఎవరికీ అనుమానం రాదు. బంగారం అంతా నేనే తీసుకోవచ్చు.” అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు.


ఇదిలా ఉండగా ఊర్లోకి వెళ్ళిన రెండో వాడు ఇలా ఆలోచించాడు.
“వాడికి సగం భాగం ఎందుకివ్వాలి? మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా! అసలే నాకు చాలా అప్పులున్నాయి. నా జీవితంలో నేను ఏదీ వెనుకేసుకోలేదు. వాడికేమో అప్పులు లేవు. ఉన్నవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బంగారమంతా నాకే దక్కాలి. కాబట్టి నేను తీసుకెళ్ళే భోజనంలో విషం కలుపుతాను. అది తిని వాడు చనిపోతాడు. ఎవరికీ తెలియకుండా బంగారమంతా నేనే తీసుకోవచ్చు” అనుకున్నాడు.


అలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్ళాడు. అతను దగ్గరికి వెళ్ళగానే అక్కడే కత్తితో పొంచి ఉన్న రెండోవాడు ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు.
“పిచ్చివాడు. సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంక నేను భోంచేస్తాను.” అనుకుని
ఏ మాత్రం అనుమానం లేకుండా తెచ్చిన అన్నాన్ని తిన్నాడు. అరగంట తర్వాత అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.
“సన్యాసి మాటలు ఎంత నిజమో కదా” అనుకున్నాడు చివరి క్షణాల్లో.

భీష్ముణ్ణి స్మరించుకుందాం…

భీష్ముడనగానే మనకు గుర్తుకొచ్చేది తండ్రి కోసం ఆయన చేసిన భీషణ ప్రతిజ్ఞ. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మాట తప్పని కఠోర దీక్ష. ఈ రోజు భీష్మ ఏకాదశి. మానవ జాతికి ఆదర్శ ప్రాయుడైన ఆ మహనీయుడు కురుక్షేత్ర సంగ్రామంలో తీవ్రంగా గాయపడి స్వచ్ఛంద మరణాన్ని పొందిన రోజు. వెళుతూ వెళుతూ తన అపారమైన పాలనా పరిజ్ఞానాన్ని ధర్మ రాజాదులకు అందించి వెళ్ళాడు. ఆ అమూల్యమైన సలహాలు నేటికీ ఆచరణీయం. 

ఆయన అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు. అష్ట వసువులలో ఒకడు. అష్ట వసువులు అనగా దేవలోకం లో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తూ బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధృవులు.

ఒక సారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్టుని ఆశ్రమంలో ఉండే కామధేనువు. దానిని వారు దొంగతనంగా తీసుకుని వెళతారు. వశిష్టుడు తన దివ్యదృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్టుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడుమంది వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కానీ కామధేవుని తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెబుతాడు.

వారు ఆ శాపం గురించి ఆలోచిస్తుండగా గంగా దేవి వారి వద్దకు వస్తుంది. వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారవేయ వలసిందిగా కోరతారు. గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది.

ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు గంగానదీలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి ఆయన కుడి తొడమీద కూర్చుంటుంది. ఆమె తనను మోహిస్తుందేమోనని ఆయన  బాధ పడి ఆమె ఎందుకు అలా కూర్చుందో అడుగుతాడు. సాధారణంగా కూతుళ్ళు, కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు. తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్ళాడవచ్చునని సూచిస్తాడు. అది విని ఆమె అంతర్ధానమైపోతుంది.

కొద్ది కాలానికి ప్రతీపునికి శంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఆయన ఒకసారి గంగాతీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు. శంతనుడు ఆమెను పెళ్ళి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది. దాని ప్రకారం పెళ్ళి తర్వాత ఆమె ఏం చేసినా శంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదు. ఆక్షేపించ కూడదు. అలా చేసిన పక్షంలో ఆమె అంతర్ధానమైపోతుంది. శంతనుడు అందుకు అంగీకరించి ఆమెను పెళ్ళి చేసుకుంటాడు.

కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు మగ సంతానం కలుగుతారు. అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది.  ఆ ఏడుగురి విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న శంతనుడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు. ఆమె ఆ శిశువును శంతనుడికిచ్చి అంతర్ధానమైపోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు. గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడు అని కూడా పిలవబడ్డాడు.

గంగాదేవి వెళ్ళిపోయిన తరువాత శంతనుడు దాసరాజు కుమార్తె సత్యవతీ దేవిని ఇష్టపడతాడు. దేవవ్రతుడు ఉండగా తన కుమారులకు రాజ్యాధికారం దక్కదని ఆమె అందుకు అంగీకరించదు. అందుకు ఆయన తాను జీవిత కాలం బ్రహ్మచారిగానే ఉంటానని ప్రతిజ్ఞ చేసి భీష్ముడని పేరు గాంచాడు. కుమారుని పితృభక్తికి మెచ్చి స్వచ్ఛంద మరణాన్ని (తను కోరుకున్నప్పుడు మరణం) వరంగా ప్రసాదించాడు తండ్రి.

తన పిన తల్లికి కలిగిన సంతానం చిత్రాంగదుడు, విచిత్రవీర్యులకు తగిన కన్యల కోసం అన్వేషిస్తూ యుద్ధంలో ఇతర రాజులను ఓడించి కాశీ రాజు కుమార్తెలు అంబ, అంబిక, అంబాలికలను తెస్తాడు. పెద్ద కుమార్తె అంబ మాత్రం తాను వేరే రాజ కుమారుడిని వరించానని చెబుతుంది. భీష్ముడు ఆమెను ఆ రాజు వద్దకు పంపిస్తాడు. ఆ రాజు యద్ధంలో తాను ఓడిపోయినందున ఆమెను స్వీకరించనని చెబుతాడు. ఆమె తిరిగి భీష్ముని వద్దకు వచ్చి యుద్ధంలో తనను గెలిచి తెచ్చాడు కాబట్టి వివాహం చేసుకోమని కోరుతుంది. తను ఆజన్మ బ్రప్మచారిగా ఉంటానని ప్రమాణం చేసి ఉన్నందున భీష్ముడు అందుకు అంగీకరించడు.

ఆమె కోపంతో వెళ్ళి భీష్ముడి గురువైన పరశురాముణ్ణి శరణు వేడుతుంది. పరశురాముడు తన శిష్యుణ్ణి పిలిచి ఆమెను పెళ్ళి చేసుకోమంటాడు. ఆడిన మాట తప్పనంటాడు భీష్ముడు. యుద్ధం అనివార్యమౌతుంది. హోరాహోరీగా పోరు కొనసాగుతుంది. తన శస్త్రాస్త్రాలతో పరశురామునే నిలువరిస్తాడు భీష్ముడు. చివరకు పరశురాముడు తన గండ్రగొడ్డలిని ప్రయోగిస్తాడు. భీష్ముడు పరశురాముడే అనుగ్రహించిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయాగిస్తాడు. రెండూ ఢీకొంటే జగత్ప్రళయం తప్పదని భూదేవి వేడుకొనగా ఇద్దరూ తమ అస్త్రాలను ఉపసంహరించుకొంటారు. గురువును మించిన శిష్యుడివయ్యావంటూ పరుశురాముడు భీష్ముణ్ణి ప్రశంసిస్తాడు.

పరశురాముడు కూడా తనకు సహాయం చేయలేకపోయినందుకు అంబ విచారించి శివుని గురించి తపస్సు చేస్తుంది. శివుడు ఆమె తపస్సుకు మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. ఆమె తన జీవితాన్ని నాశనం చేసిన భీష్ముని చావుని కోరుకుంటుంది. అది ఆమె ఆ జన్మలో ఉండగా జరగదని చెబుతాడు శివుడు.  ఆమె తర్వాతి జన్మలో శిఖండిగా జన్మించి భీష్ముడి చావుకు కారణమైంది.