కథా సరిత్సాగరం

కథా సరిత్సాగరం

కథలు… ముఖ్యంగా ప్రాచీన జానపద కథలంటే ఇష్టపడేవారికి ఓ శుభవార్త! భారతీయ సాహిత్యంలో కథా సరిత్సాగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని పదకొండవ శతాబ్దానికి చెందిన సోమదేవుడు అనే బ్రాహ్మణుడు సంస్కృతంలో రచించినట్లుగా తెలుస్తోంది. ఇది గుణాఢ్యుడు అనే పండితుడు దక్షిణ భారతదేశానికి సంబంధించిన పైశాచీ భాషలో రాసిన బృహత్కథ ఆధారంగా రాయబడింది. కాశ్మీర దేశ రాజైన అనంతదేవుడి పట్టమహిషి అయిన సూర్యమతీ దేవి వినోదం కోసం ఈ కథలు రాయబడినట్లుగా తెలుస్తోంది. ఈ కథల్ని 18 పుస్తకాలు, 124 అధ్యాయాలు, 21000 శ్లోకాల్లో రాశారు. ఇవన్నీ మహారాజు ఉదయనుడి కుమారుడైన నరవాహనదత్తుడి సాహసాల చుట్టూ తిరుగుతాయి.

నవరసభరితమైన ఈ కథల్ని సరళ తెలుగు భాషలో నవ్య తెలుగు వారపత్రిక లో ధారావాహికంగా ప్రచురిస్తున్నారు. ఆ పత్రికలో రచయిత(త్రి) అనీలజ అని పేర్కొన్నారు. వారి అసలు పేరు ఎవరికైనా తెలిసుంటే చెప్పండి.

1920 ప్రాంతాల్లో సీ హెచ్ టౌనీ, ఎన్.ఎం పెంజర్ అనే ఇరువురు ఆంగ్ల రచయితలు కలిసి సోమదేవుడు రాసిన సంస్కృత రచనలను పది భాగాల్లో ఆంగ్లం లోకి అనువాదం చేశారు. ఆ పుస్తకాల పీడీఎఫ్ లు ఆర్కైవ్.ఆర్గ్ సైటులో ఉచితంగా లభ్యమౌతున్నాయి. ఈ పది పుస్తకాల లంకెల కోసం ఈ ఆంగ్ల వికీ పేజీ లోని References విభాగంలో చూడండి.

మరి ఇంకెందుకాలస్యం?…. జానపద కథా జగత్తులో విహరించండి!!

హైసరబన్నాలు

చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన కథ

ఓ పల్లెటూరి అబ్బాయి ఓ సారి భార్యను ఇంటి దగ్గరే వదిలేసి అత్తగారింటికి వెళ్ళాడు.

చాలాకాలం తర్వాత ఇంటికి వచ్చిన అల్లుడికి ఏమైనా చేసి పెడదామని అత్తగారు కుడుములు చేసింది. అంతకు ముందు అతను ఎప్పుడూ తినలేదేమో అవి ఆ అల్లుడికి తెగ నచ్చేశాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యను కూడా అవి చేసి పెట్టమని అడుగుదామనుకున్నాడు.

“అత్తా! ఇవి భలే ఉన్నాయి. నేను ఇంటికి పోయిన తర్వాత మీ కూతుర్ని అడిగి ఇలాంటివే చేయించుకుంటాను. వీటినేవంటారు?” అనడిగాడు.

“వీటిని కుడుములంటారు నాయనా” అని చెప్పిందా అత్త.

అతనికి కొంచెం మతిమరుపు. ఆ పేరు ఎక్కడ మరిచిపోతామో అని.. దారంతా ‘కుడుములు కుడుములు..’ అని తలుచుకుంటూ పోతున్నాడు.

మధ్యలో ఒక చిన్న కాలువ అడ్డం వచ్చింది. దాన్ని ఊపు మీద దూకడానికి “హైసర బన్నా” అన్నాడు.

అంతే మరుక్షణం కుడుములు అనే పదం మరిచిపోయి ‘హైసరబన్నా, హైసరబన్నా‘ అనుకుంటూ ఇంటికి చేరాడు.

ఇంటికి రాగానే భార్యను పిలిచి,

“నేను మీ ఇంటికి వెళ్ళినపుడు మీ అమ్మ హైసరబన్నాలు చేసిపెట్టింది ఎంత రుచిగా ఉన్నాయో! నువ్వు నాకు ఇప్పుడు అవి చేసిపెట్టాలి” అన్నాడు.

హైసరబన్నాలా? అయేంటో నాకు తెలీదయ్యో..” అంది భార్య.

“మీ అమ్మ చేసిపెట్టింది కదే! నీకు తెలీదా? ఏమో నాకు ఇప్పుడు హైసరబన్నాలు చేసిపెట్టాల్సిందే” అంటూ పట్టుబట్టాడు.

“అవేంటో నాకు తెలీదు” మొర్రో అంటున్నా వినలేదు.

మాట వినకపోయే సరికి చిర్రెత్తుకొచ్చి దుడ్డుకర్ర తీసుకుని ఆమె మీదకు రాబోయాడు.

చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళంతా గుమిగూడి అతన్ని పట్టుకొని “ఓరి సచ్చినోడా! ఆ కర్రతో కొడితే అది ఉండాల్నా పోవాల్నా.. ఒళ్ళంతా కుడుముల్లాగా వాచిపోతాదిరా” అన్ని అమ్మలక్కలంతా చీవాట్లు పెట్టడం మొదలెట్టారు.

అప్పుడు వెలిగింది మనవాడికి…. ” ఆ…. అయే నేం జేసి పెట్టమంది… కుడుములు కుడుములు” అన్నాడు.

“ఈ మాట ముందుగానే సెప్పుంటే నేనెందుకు చేసిపెట్టను ఓ యక్కల్లో…” అని భోరుమందా భార్య.


దుర్వార్త ఎలా చెప్పాలంటే…

కార్లోస్ ఇంట్లో ఓరోజు ఉదయాన్నే ఫోన్ మోగింది.

“హలో సార్! నేను ఆర్నాల్డ్ ను. మీ ఫాం హౌస్ చూసుకునే పనోణ్ణి”

“ఆ ఆర్నాల్డ్ చెప్పు. ఏమైనా కావాలా?”

“అది చెప్పాలనే చేశాను సార్. మీ చిలక చచ్చిపోయిందండీ”

“ఏంటీ! నా చిలుక చచ్చిపోయిందా. అదే పందెంలో గెలిచిన చిలక?”

“ఆ అవును! అదే సార్.”

“ఓహ్!! ఎంత పని జరిగింది. దాన్ని తేవడానికి చాలా ఖర్చయింది. సరేలే, ఎలా చనిపోయింది?”

“కుళ్ళిపోయిన మాంసం తిని చనిపోయింది సార్”

“కుళ్ళిపోయిన మాంసమా? ఏ వెధవ పెట్టాడు?”

“అబ్బే ఎవరూ పెట్టలేదు సార్. దానంతట అదే చనిపోయిన గుర్రం మాంసం తినేసింది సార్.”

“చనిపోయిన గుర్రమా? అదెక్కడ?”

“అదే మన దగ్గరున్న మేలైన జాతి గుర్రాలున్నాయి కదా సర్. అవి నీళ్ళు మోసే బండి లాగి లాగి అలిసిపోయి చనిపోయాయి సార్ “

“నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ గుర్రాలు నీళ్ళ బండ్లు లాగడమేంటి? అసలు అన్ని నీళ్ళెందుకు అవసరమయ్యాయి?”

“మరేమో….అదీ.. మంటలార్పడానికి సార్.”

“మంటలా? మంటలేంటి?”

“అదే సర్ మీ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఒక కొవ్వొత్తి కిందపడి కర్టెన్ అంటుకుంది. ఆ మంటలు చిన్నగా ఇల్లంతా కమ్మేశాయి.”

“ఓరి బాబూ!! ఇంట్లో కరెంటు ఉంది కదా!!!  కొవ్వొత్తి ఎందుకు పెట్టారు?!!!!”

“మరేమో ఒక మనిషి చనిపోయిన ఇంట్లో దీపం వెలుగుతూ ఉండాలి అంటారు కదా సార్. అందుకనీ…”

“చనిపోయారా? ఎవరు?”

“మీ అమ్మగారు సార్. ఓ రోజు రాత్రి బాగా చీకటి పడ్డాక మీ ఇంట్లోకి రాబోతున్నారు. ఎవరో దొంగేమో అనుకుని కాల్చేశాను సార్ “

“!@#$%#@$%‌&**@@$%”

ఆధారం:సిలికాన్ఇండియా.కామ్

పెళ్ళి ముచ్చట్లు

పెళ్ళి చేసుకుని తిరిగొచ్చి ఆరు రోజులౌతుంది. టపా రాయడానికి ఇప్పుడు తీరిక చేసుకుంటున్నా.

వెళుతూ వెళుతూ ఆహ్వానం టపా రాసేసి వెళ్ళిపోయి మళ్ళీ ఓ నెల పాటు బ్లాగు వైపు చూడనే లేదు.

ముందుగా ఆ టపాలో శుభాకాంక్షలందజేసిన ఆత్మీయ మిత్రులు  రిషి, యజ్ఞవల్క, యనమండ్ర, మాలా కుమార్, సునీత, దుర్గేశ్వర, రంజని, జాన్ హైడ్, సుజాత, హరే కృష్ణ, వల్లభ, తెలుగిల్లు, శ్రావ్య వట్టికూటి, నేస్తం, క్రిష్ణ, అనుపమ, శీను, క్రిష్ణమోహన్, స్నిగ్ధ, సుధాకర బాబు, నెలబాలుడు గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

మీ అందరి ఆశీస్సులతో పెళ్ళి బాగా జరిగింది. ముహూర్తం సమయం 10-11 మధ్యనే కావడంతో కార్యక్రమాలన్నీ హడావిడిగా జరిపించేశాడు మా పంతులు. తీరా నన్ను పెళ్ళికొడుకుని చేసే సమయానికి నేను పట్టుబట్టి మరీ తెప్పించుకున్న పట్టుపంచ ధోవతి లాగా కట్టే వాళ్ళే కరువయ్యారు. ఎంతోమంది పెద్దవాళ్ళు వస్తారు కదా ఎవరో ఒకరు కడతార్లే అనుకున్నా. చివరికి అడ్డ పంచె లాగా కట్టుకోవడానికి ఉద్యుక్తుడనవుతుండగా పక్కనే ఉన్న ఒక షాపు నుంచి ఒకాయన దేవుడు పంపించినట్లు వచ్చి ధోవతి కట్టేసి వెళ్ళిపోయాడు.

దాదాపు రాత్రి ఒంటి గంటయ్యే సమయానికి కార్యక్రమాలన్నీ పూర్తైపోయాయి. అప్పుడు గుడికి వెళ్ళి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుందామంటే గుడి మూసేసి ఉంది. గుడి ఉదయం ఆరు గంటలకు తెరుస్తారు. అప్పటి దాకా మేలుకుని ఉండి పెళ్ళిబట్టలతో గుడికెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిదని పంతులుగారు సలహా ఇచ్చారు.

ఇక అప్పుడు మొదలయ్యాయి మా కష్టాలు. ఓ వైపు పెళ్ళి కొచ్చిన బంధువులంతా ఒకరి తర్వాత ఒకరు ఇంటికి వెళ్ళిపోయారు. చివరికి మేమిద్దరమే మిగిలాం. ఒకరికెదురుగా ఒకరు కూర్చుని ఎలాగోలా కునుకు తీయకుండా ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం. సరిగ్గా ఉదయం ఆరు గంటలు అయ్యేసరికి అప్పటి దాకా ఆమోదించిన వర్షం ఒక్కసారిగా ప్రారంభమైంది. కొత్త దంపతులు వర్షంలో తడవకూడదని చెప్పారు. మళ్ళీ ఓ గంటసేపు వర్షం తగ్గేదాకా అలాగే ఎదురు చూశాం. ఆ తర్వాత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని ఇంటికి వెళ్ళాం. స్నానం చేసి బెడ్ మీద పడితే ఎలా నిద్ర పట్టిందో కూడా గుర్తు లేదు.

నిరుడు మా గృహ ప్రవేశం జరిగినప్పటి నుంచీ వాయిదా పడుతూ వస్తున్న సత్యనారాయణ స్వామి వ్రతం మా నవదంపతుల చేతుల మీదుగా జరగాలని ఉందేమో, మరుసటి ఆదివారం కుదరడంతో జరిపించేశాం.  ఇక ఆ తర్వాత విందులూ, వినోదాలూ మామూలే కదా… అలా జరిగిపోయింది.