అసాధ్యం సుసాధ్యం

కొన్ని వందల ఏళ్ళ క్రిందట ఇటలీ దేశంలోని ఒక పట్టణం లో ఒక వ్యాపారస్థుడు ఉండేవాడు. అతని దురదృష్టం కొద్దీ ఒక వడ్డీ వ్యాపారికి పెద్ద మొత్తంలో సొమ్ము బాకీ పడ్డాడు. ఆ వడ్డీ వ్యాపారి ముసలై వాడైనా మంచి జిత్తుల మారి. అతనికి తనకి బాకీ ఉన్న వ్యాపారి కూతుర్ని ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది. దాంతో అతని కూతుర్ని తనకిచ్చి వివాహం జరిపిస్తే అప్పు మొత్తాన్నీ మాఫీ చేస్తానని ప్రతిపాదన చేశాడు. ఆ వ్యాపారి, అతని కూతురికీ ఈ ప్రతిపాదన వినగానే చాలా భయం వేసింది.

ఆ వడ్డీ వ్యాపారి పందెం ఇలా ఉంది. అతను ఒక ఖాళీ సంచీ లో ఒకే పరిమాణం, ఆకృతిలో ఉండే ఒక తెల్ల రాయి,  ఒక నల్ల రాయి వేస్తాడు. ఆ అమ్మాయి ఆ రెండు రాళ్ళలో ఒకటి బయటికి తీయాలి. ఒక వేళ ఆమె నలుపు రాయి బయటికి తీస్తే అతన్ని పెళ్ళి చేసుకోవాలి. ఆమె తండ్రి అప్పు చెల్లించనవసరం లేదు. ఒక వేళ ఆమె తెల్ల రాయి బయటికి తీస్తే ఆమె అతన్ని పెళ్ళి చేసుకోనక్కర్లేదు కానీ తండ్రి బాకీ పడ్డ సొమ్ము చెల్లించనక్కర్లేదు. కానీ ఆమె రాయి తీయనంటే మాత్రం ఆమె తండ్రి జైలు పాలు కావాల్సి ఉంటుంది.

వాళ్ళు ముగ్గురూ వ్యాపారి ఇంట్లో  ఉన్నారు. వాళ్ళు నిల్చున్న దారిలో రకరకాల రాళ్ళున్నాయి. వాళ్ళలా మాట్లాడూతూ వెళుతుండగా ఆ వ్యాపారి రాళ్ళు తీసుకోవడానికి కిందికి వంగాడు. అలా తీస్తుండగా అతను రెండూ నల్ల రాళ్లనే తీసుకుని సంచిలో వేయడం ఆ అమ్మాయి గమనించింది. తర్వాత ఆ అమ్మాయిని ఏదో ఒక రాయిని బయటికి తీయాల్సిందిగా కోరాడు.

ఇప్పుడు ఆ అమ్మాయికి ఉన్న అవకాశాలు ఇవి.

  1. ఒక వేళ ఆ అమ్మాయి రాయి తీయనని నిరాకరిస్తే తండ్రి జైలుకి వెళ్ళాల్సి వస్తుంది.
  2. ఆ అమ్మాయి  రెండు రాళ్ళనీ బయటికి తీసి అందరికీ చూపించి అతన్ని మోసగాడని నిరూపించడం.
  3. ఏదో ఒక రాయిని (నలుపు) బయటికి తీసి అతన్ని పెళ్ళి చేసుకుని తండ్రిని అప్పుల్లోంచి కాపాడటం.

కానీ ఆ అమ్మాయి ఇవేమీ చెయ్యలేదు. నెమ్మదిగా సంచీలో చెయ్యి పెట్టి ఒక రాయిని బయటికి తీసింది. దానివైపు చూడకుండానే కావాలనే కిందకి జారవిడిచింది. ఆ రాయి వాళ్ళ నడుస్తున్న దారిలో ఉన్న రాళ్ళలో కలిసిపోయింది.

“అయ్యయ్యో.. రాయి కింద పడిపోయింది” అంది ఆమె బాధ నటిస్తూ.

“కానీ నేనేం రంగు రాయి తీశానో తెలుసుకోవాలంటే ఒక మార్గం ఉంది. ఇప్పుడీ సంచీ లో ఉన్న రాయిని తీసి చూస్తే అదే రంగులో ఉంటుందో అందుకు వ్యతిరేకంగా ఉన్న రాయి నేను తీసినట్లు లెక్క” అంది ఏ మాత్రం తొణక్కుండా…

సంచీలో ఇక మిగిలింది కూడా నల్ల రాయే కాబట్టి, ఆమె తీసింది ఖచ్చితంగా తెల్లరాయేనని ఒప్పుకుని తీరాలి. ఆ వడ్డీ వ్యాపారి తను మోసం చేశానని ఒప్పుకునే ధైర్యం లేదు. విధిలేక అతను తన బాకీ మొత్తం రద్దు చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

అతను తనను పెళ్ళి చేసుకోకుండా చూడటం, తండ్రి అప్పును మాఫీ చేయడం ఒకేసారి చేయడం దాదాపుగా అసాధ్యం. చూశారా తెలివితేటలతో ఆ అమ్మాయి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిందో…

రామాయణ పారాయణం

ఒకసారి ఓ పల్లెటూరి వ్యక్తి ఒకాయన రైల్వేస్టేషన్ లో కూర్చుని తను ఎక్కాల్సిన రైలు కోసం ఎదురు చూస్తూ రామాయణం చదువుకుంటూ కూర్చున్నాడు.

ఓ యువకుడు భార్యతో సహా వచ్చి పక్కనే నిల్చుని ఇలా అంటున్నాడు.

“మీ పెద్దవాళ్ళెప్పుడూ ఇంతే చదవడానికి ఇంకే పుస్తకం లేనట్టు ఎప్పుడు జూసినా రామాయణం పట్టుకుని చదువుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఎన్నో పుస్తకాలుండగా మీరింకా రామాయణమే చదువుతున్నారు. అసలేంటి దాని గొప్ప?” అని అడిగాడు.

ఆ వ్యక్తి ఏమీ సమాధానం ఇవ్వకుండా చిరునవ్వు నవ్వుకుంటూ చదవడంలోనే లీనమైపోయాడు. రైలు రావడం మరో అర్ధగంట ఆలస్యం కావడంతో ఆ యువకుడు అలా బయటకి వెళ్ళొచ్చాడు. అతను తిరిగొచ్చేసరికి ఆయన ఇంకా రామాయణం చదువుతూనే కనిపించాడు. అతనికింకేమీ తోచక ఆ పల్లెటూరి వ్యక్తిని ఇంకా విమర్శించడం మొదలుపెట్టాడు.

కొద్ది సేపటి తర్వాత రైలు రానే వచ్చింది. సీటు కోసం అందరూ తోసుకుంటూ ముందుకు చొరబడిపోతున్నారు. లోపలికెళ్ళేసరికి ఆ యువకుడు, పల్లెటూరాయన పక్క పక్క సీట్లలోనే కూర్చుని ఉన్నారు. ఆయన మాత్రం రామాయణం చదవడం మానలేదు.

ఉన్నట్టుండి ఆ యువకుడు భార్య కోసం వెతకడం ప్రారంభించాడు. ఎక్కడా కనపడ లేదు. అప్పటికే బయల్దేరిన రైలు ఆపడానికి గొలుసు లాగాడు. ఇంకా ప్లాట్‌ఫారం మీదనే ఉందేమోనని ఆతృతగా వెతుకుతున్నాడు.

అప్పుడా పల్లెటూరాయన “నువ్వు రామాయణం చదువుంటే నువ్వు ఈ పొరబాటు చేసుండేవాడివి కావు” అన్నాడు.

“ఏంటీ?” అతను ఆశ్చర్యంగా చూశాడు.

అప్పుడాయన ఇలా అన్నాడు.

“రామాయణంలో రాముడు, సీతాలక్ష్మణ సమేతుడై గంగా తీరాన నిలిచి ఉన్నాడు. అప్పుడే పడవ వచ్చి ఆగింది. రాముడి ముందు సీతని అందులో ఎక్కమని తర్వాత తను ఎక్కాడు”

నువ్వు నన్ను ఇంతకుముందు అడిగావు కదా? రామాయణం ఎందుకు చదువుతూ ఉంటావనీ… ఇందుకే చూశావా ఇలాంటి చిన్న సందిగ్ధాలకు కూడా రామాయణంలో సమాధానం దొరుకుతుంది. అన్నాడు.

ఇద్దరు స్ఫూర్తి ప్రధాతలు

ఇటీవల ఆన్‌లైన్ లో కొన్ని కథనాలు చదువుతుంటే నాకు ఆసక్తి కలిగించిన ఇద్దరు స్పూర్తి ప్రధాతల గురించి రాద్దామనే ఈ టపా…

ఒకరేమో దుగ్గిరాల పూర్ణచంద్రారావు అలియాస్ చందూ. కేవలం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తో సంవత్సరానికి లక్ష డాలర్లు దాకా సంపాదించవచ్చని ఇతన్ని చూసిన తర్వాతే తెలిసింది. ఏదైనా దిగితే కానీ లోతు తెలియదంటారు. ఇంతకు ముందు ఎక్సెల్ ను చూసి “ఆ ఏముంది ఇందులో?  టేబుల్స్ గట్రా చేస్తారు. అంతే కదా!” అనుకునే వాణ్ణి. కానీ ఇతన్ని గురించి చదివాక ఎక్సెల్ తో ఇంత సంపాదించచ్చా అని ఆశ్చర్యపోయాను. ఇతను ఎక్సెల్ లోతుపాతుల్ని చవిచూసి తన బ్లాగు ద్వారా చిట్కాలను ప్రపంచానికి అందజేస్తుంటాడు. అంతే కాకుండా తను నేర్చుకున్న చిట్కాలన్నింటినీ క్రోడీకరించి ఒక పుస్తకం కూడా రాశాడు. ఎక్సెల్ కు సంబంధించి కొన్ని సాఫ్ట్‌వేర్లు తయారు చేసి కూడా అమ్ముతూ ఉంటాడు. ఒక విషయం గురించి బాగా పరిశోధన చేస్తే అందులోనే బోలెడన్ని అవకాశాలు సృష్టించుకోవచ్చని ఇతన్ని చూసి బాగా అర్థమయ్యింది నాకు. ఆంధ్రా యూనివర్సిటీ లో బ్యాచిలర్ డిగ్రీ, ఐఐఎమ్ ఇండోర్ నుంచి ఎంబీయే పూర్తి చేసిన ఇతను కొంతకాలం పాటు టీసీయెస్ లో కూడా పనిచేశాడు. తరువాత పూర్తి సమయాన్ని ఈ వ్యాపకం పై వెచ్చించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి తమ స్వంత ఊరైన విశాఖపట్టణం నుంచే తన కార్యకలాపాల్ని నిర్వహిస్తూ ఉంటాడు, భార్యతో సహా!. ఇంతకన్నా కావాల్సిందేముంది చెప్పండీ? ( అరుణపప్పు గారి బ్లాగు నుంచి…)

ఇక రెండో అబ్బాయి బీహారు కు చెందిన కౌశలేంద్ర. కూరగాయలకు బీహార్ ను కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది అతని లక్ష్యం. ఎంబీయే విద్యకు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఐఐఎం అహ్మదాబాదు లో 2007 సంవత్సరానికి ప్రథమ స్థానంలో నిలిచినవాడు. తన సహోధ్యాయిల్లాగా కోట్లు సంపాదించే కార్పొరేట్ ఉద్యోగాన్ని కోరుకోలేదు. బీహార్ అభ్యున్నతికి పాటుపడాలనుకున్నాడు. స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన కౌశలేంద్ర ఎంబీయే పూర్తి చేసిన వెంటనే క్షేత్ర పరిశోధన కోసం విస్తృతంగా పర్యటించాడు. ఎందరో రైతుల్ని కలిసి వ్యవసాయంలో మెలకువల్ని శ్రద్ధగా ఆకళింపు చేసుకున్నాడు. తరువాత కౌసల్య ఫౌండేషన్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ ద్వారా చేపట్టిన మొట్టమొదటి ప్రాజెక్టు ఏసీ బండ్ల ద్వారా కూరగాయలు అమ్మే విధానం. ఈ విధానం ద్వారా కూరగాయలు ఎక్కువకాలంపాటు పాడవకుండా ఉండి నష్టాన్ని నిలువరిస్తాయి. ప్రస్తుతం ప్రీపెయిడ్ కార్డుల ద్వారా కూరగాయల్ని కొనే వ్యవస్థను అభివృద్ధి పరిచే పనిలో ఉన్నాడు. కానీ ఈ ప్రయత్నంలో అతను ఎన్నో బాలారిష్టాలు ఎదుర్కొంటున్నాడట. ఉదాహరణకు బ్యాంకులో జమ చేసిన చెక్కు మూడు నెలలకు కూడా జమ కాకపోవడం, ఏసీ బండ్ల కోసం ఋణాలు మంజూరు చేసినా డబ్బు సరిగా విడుదల చేయకపోవడం మొదలైనవి. విద్యావంతుడైన తన పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అని వాపోతున్నాడు. గంగానదీ పరీవాహక ప్రాంతంలోని సారవంతమైన నేలలో పండే కూరగాయల్ని సరైన విధంగా మార్కెటింగ్ చేసుకుంటే రాష్ట్రం మరింత వృద్ధి సాధించగలదన్నది అతని నమ్మకం. పండించిన రైతుకే నేరుగా లాభం చెందాలన్న ఉద్దేశ్యంతో అతను నేరుగా ఉత్పత్తిదారులతోనే లావాదేవీలు నడుపుతూ ఉంటాడు. తన వ్యవస్థను విస్తరించడానికి వ్యవసాయ శిక్షణా సంస్థ సహకారం కూడా తీసుకుని ముందుకు సాగిపోతున్నాడు. తొందర్లోనే అతని లక్ష్యాన్ని సాధించాలని మనందరం ఆశీర్వదిద్దాం. (సిలికాన్‌ఇండియా.కామ్ సౌజన్యంతో)