ఈ రోజు డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా లో ఏదైనా పుస్తకం చదువుదాం అని వెతుకుంటే యథాలాపంగా “అన్వేషణ – అనుభూతి” అనే పుస్తకం పైకి నా దృష్టి మళ్ళింది. ఆ సమయంలో ఏం అన్వేషించాలో తెలియని అన్వేషణ నాది. ఈ పుస్తకంలో అన్వేషణ దేని గురించో చూద్దామని పుస్తకం తెరిచా. రచయిత డాక్టర్ మోపిదేవి కృష్ణస్వామి. “ఇంతకుముందు ఈ పేరెప్పుడూ విన్నట్టు లేదే. అయినా పేరున్న రచయితల పుస్తకాలు ఎప్పుడూ చదివేవేగా; చూద్దాం ఈ పుస్తకంలో ఏముందో?” అనుకుంటూ పేజీ తిప్పాను. ప్రచురణ కర్తలు: ది వరల్డ్ టీచర్ ట్రస్టు సోదర బృందం, అమలాపురం అని రాసి ఉంది. ఇంకా 1982 లో ముద్రించబడినట్టుగా రాసుంది ఆ పుస్తకంలో.
ఈ పుస్తకం దేని గురించి రాశారో పరిచయ వాక్యాలు కొన్ని చదివేసరికి అర్థమయ్యింది. అప్పట్లో విద్యార్థులు తమ యవ్వనంలో విపరీతమైన భావావేశపు తుఫానులో కొట్టుకుపోతుంటే కొన్ని స్వార్థ శక్తులు వారిని తమ రాజకీయాలకు, మత ప్రయోజనాలకు, దేశ విద్రోహ చర్యలకు వాడుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆలంబనగా డాక్టర్ కృష్ణస్వామి తన ఆత్మకథనే ఈ పుస్తకంగా రాశారు. నా చిన్నతనంలో, చదువుకునే రోజుల్లో నక్సలిజం ప్రభావం అంతగా లేకపోయినా, అప్పట్లో బాగా చదువుకున్న వాళ్ళు, మేథావులు కూడా సమాజాన్ని బాగుచేయాలనే ఉద్దేశ్యంతో అడవుల బాట పట్టేవారని విన్నాను. “అలా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు?” అని నన్ను నేను చాలా సార్లు ప్రశ్నించుకున్నాను. అందుకు ఈ పుస్తకంలో కొంత సమాధానం దొరకవచ్చని చదవడం మొదలుపెట్టాను.
క్రిష్ణస్వామి గారు ఈ పుస్తకంలో తాను చిన్నతనం నుంచి పెద్దయ్యేంత వరకు తన ఆలోచన స్రవంతీ ఎలా సాగిందీ క్లుప్తంగా, స్పష్టంగా వివరిస్తారు. చిన్నతనంలోనే ఆయన్ను సమాజంలోని తారతమ్యాలు, కుల వర్గ వైషమ్యాలు మొదలైనవి ఆలోచింపజేశాయి. వాటిని ఎలా రూపు మాపాలో ఆయన అనునిత్యం మథనపడుతూ ఉంటాడు. ఆ మార్గంలో ఆయన ఎవరెవరినీ కలుసుకున్నదీ, ఎలా ఇంటరాక్ట్ అయిందీ వివరిస్తాడు. అలా ఆయన ఎమ్మే చదివేటపుడు తనతో భావ సారూప్యత గల సీనియర్లతో పరిచయం ఏర్పడుతుంది. వాళ్ళు కృష్ణస్వామిని “విప్లవ మార్గం” లోకి రమ్మని ఆహ్వానిస్తారు. ఆయన వారి పద్ధతులలో లోటుపాట్లను ఎత్తి చూపుతాడు. వాళ్ళు తమ మార్గం సరైంది కాకపోతే, సరైన మార్గం ఏదని అడుగుతారు. ఆయన నా అన్వేషణ అందుకోసమే అని చెప్పి వాళ్ళ నుంచి దూరంగా వచ్చేస్తారు. అలా కొంతకాలం తనలోతానే మథనపడి ఈ సమాజాన్ని బాగు చేసే మార్గం తన వద్ద లేదనీ, అలా బతకడం కన్నా చనిపోవడమే మేలనుకుంటాడు. చివరికి తన గురువు సాహచర్యంలో జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటాడు.
ఇలాంటి విషయాల గురించి బొందలపాటి గారు తన బ్లాగులో తరచుగా రాస్తూ ఉంటారు. బొందలపాటి గారూ, ఒక వేళ మీరు ఇదివరకే ఈ పుస్తకం చదవకుండా ఉంటే ఈ టపా మీ కోసమే!
*పుస్తకం కేవలం 49 పేజీలు మాత్రమే. ప్రింట్ లో ఉన్నదీ లేనిదీ తెలియదు. ఆన్లైన్ లో మీరూ చదవాలనుకుంటే పైన పుస్తకం పేరులో ఇచ్చిన లింకు మీద నొక్కి చదవచ్చు.