దైవానుగ్రహమా? పురుష ప్రయత్నమా?

ఇది మహాభారతంలోని ధర్మ సంభాషణ. ఇలాంటి సందేహమే చాలామందికి కలిగి ఉండవచ్చు.

ధర్మరాజు భీష్మ పితామహుణ్ణి ఇలా ప్రశ్నిస్తాడు.

ధర్మరాజు: స్వామీ! దైవానుగ్రహమా? పురుష ప్రయత్నమా? ఈ రెండింటిలో ఏది ప్రభావ వంతమైన సాధనము?

భీష్ముడు: దైవానుగ్రహమనేది సాధనమనడానికి వీల్లేదు. సాధన చేయడమనేది మనుష్యునికి సంబంధించినది. ఈ అనుగ్రహం భగవంతుడు ఇవ్వవల్సిందే కానీ మనుష్యుడు స్వేచ్ఛగా తీసుకోలేడు. దైవభక్తినైతే సాధనమనవచ్చు.  దైవభక్తిని పురుష ప్రయత్నంలో భాగంగా అలవరుచుకోవడం వల్ల దైవానుగ్రహం పొందే వీలుంది. కనుక దైవభక్తిని పురుష ప్రయత్నంలో భాగంగా చేసి దేవునిపై భారం వేసి ప్రయత్నం చేయడమే ప్రభావయుతమైన సాధనం. దైవాన్ని పూర్తిగా వదిలివేసి ప్రయత్నం చేస్తే అప్పుడు దైవానుగ్రహం కోల్పోయినట్లే లెక్క. అప్పుడు అది పరిపూర్ణ ప్రయత్నమనిపించుకోదు. కాబట్టి దైవాన్ని ప్రార్థించడం ప్రయత్నంలో భాగంగా ఉండాలే కానీ, నా ప్రయత్నం గొప్పదా? దైవం గొప్పదా అని ప్రశ్నించుకోవడం సరి కాదు.

*డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో…

అన్వేషణ – అనుభూతి: పుస్తక సమీక్ష

ఈ రోజు డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా లో ఏదైనా పుస్తకం చదువుదాం అని వెతుకుంటే యథాలాపంగా “అన్వేషణ – అనుభూతి” అనే పుస్తకం పైకి నా దృష్టి మళ్ళింది. ఆ సమయంలో ఏం అన్వేషించాలో తెలియని అన్వేషణ నాది. ఈ పుస్తకంలో అన్వేషణ దేని గురించో చూద్దామని పుస్తకం తెరిచా. రచయిత డాక్టర్ మోపిదేవి కృష్ణస్వామి. “ఇంతకుముందు ఈ పేరెప్పుడూ విన్నట్టు లేదే. అయినా పేరున్న రచయితల పుస్తకాలు ఎప్పుడూ చదివేవేగా; చూద్దాం ఈ పుస్తకంలో ఏముందో?” అనుకుంటూ పేజీ తిప్పాను. ప్రచురణ కర్తలు: ది వరల్డ్ టీచర్ ట్రస్టు సోదర బృందం, అమలాపురం అని రాసి ఉంది. ఇంకా 1982 లో ముద్రించబడినట్టుగా రాసుంది ఆ పుస్తకంలో.

ఈ పుస్తకం దేని గురించి రాశారో పరిచయ వాక్యాలు కొన్ని చదివేసరికి అర్థమయ్యింది. అప్పట్లో విద్యార్థులు తమ యవ్వనంలో విపరీతమైన భావావేశపు తుఫానులో కొట్టుకుపోతుంటే కొన్ని స్వార్థ శక్తులు వారిని తమ రాజకీయాలకు, మత ప్రయోజనాలకు, దేశ విద్రోహ చర్యలకు వాడుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆలంబనగా డాక్టర్ కృష్ణస్వామి తన ఆత్మకథనే ఈ పుస్తకంగా రాశారు. నా చిన్నతనంలో, చదువుకునే రోజుల్లో నక్సలిజం ప్రభావం అంతగా లేకపోయినా, అప్పట్లో బాగా చదువుకున్న వాళ్ళు, మేథావులు కూడా సమాజాన్ని బాగుచేయాలనే ఉద్దేశ్యంతో అడవుల బాట పట్టేవారని విన్నాను. “అలా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు?” అని నన్ను నేను చాలా సార్లు ప్రశ్నించుకున్నాను. అందుకు ఈ పుస్తకంలో కొంత సమాధానం దొరకవచ్చని చదవడం మొదలుపెట్టాను.

క్రిష్ణస్వామి గారు ఈ పుస్తకంలో తాను చిన్నతనం నుంచి పెద్దయ్యేంత వరకు తన ఆలోచన స్రవంతీ ఎలా సాగిందీ క్లుప్తంగా, స్పష్టంగా వివరిస్తారు. చిన్నతనంలోనే ఆయన్ను సమాజంలోని తారతమ్యాలు, కుల వర్గ వైషమ్యాలు మొదలైనవి ఆలోచింపజేశాయి. వాటిని ఎలా రూపు మాపాలో ఆయన అనునిత్యం మథనపడుతూ ఉంటాడు. ఆ మార్గంలో ఆయన ఎవరెవరినీ కలుసుకున్నదీ, ఎలా ఇంటరాక్ట్ అయిందీ వివరిస్తాడు. అలా ఆయన ఎమ్మే చదివేటపుడు తనతో భావ సారూప్యత గల సీనియర్లతో పరిచయం ఏర్పడుతుంది. వాళ్ళు కృష్ణస్వామిని “విప్లవ మార్గం” లోకి రమ్మని ఆహ్వానిస్తారు. ఆయన వారి పద్ధతులలో లోటుపాట్లను ఎత్తి చూపుతాడు. వాళ్ళు తమ మార్గం సరైంది కాకపోతే, సరైన మార్గం ఏదని అడుగుతారు. ఆయన నా అన్వేషణ అందుకోసమే అని చెప్పి వాళ్ళ నుంచి దూరంగా వచ్చేస్తారు. అలా కొంతకాలం తనలోతానే మథనపడి ఈ సమాజాన్ని బాగు చేసే మార్గం తన వద్ద లేదనీ, అలా బతకడం కన్నా చనిపోవడమే మేలనుకుంటాడు. చివరికి తన గురువు సాహచర్యంలో జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటాడు.

ఇలాంటి విషయాల గురించి బొందలపాటి గారు తన బ్లాగులో తరచుగా రాస్తూ ఉంటారు. బొందలపాటి గారూ, ఒక వేళ మీరు ఇదివరకే ఈ పుస్తకం చదవకుండా ఉంటే ఈ టపా మీ కోసమే!

*పుస్తకం కేవలం 49 పేజీలు మాత్రమే. ప్రింట్ లో ఉన్నదీ లేనిదీ తెలియదు. ఆన్‌లైన్ లో మీరూ చదవాలనుకుంటే పైన పుస్తకం పేరులో ఇచ్చిన లింకు మీద నొక్కి చదవచ్చు.

నారద తుంబురుల కథ

ఒకనాడు నారద తుంబురులు కలిసి వైకుంఠానికి వెళ్ళారు. తుంబురుడు గొప్ప గాయకుడు. తన గానామృతం తో విష్ణుమూర్తిని కీర్తించాడు. విష్ణుమూర్తి సంతసించి తుంబురుని మంచి వస్త్రాభరణాలతో సత్కరించాడు. నారదుడికి తుంబురుడిపై ఈర్ష్య కలిగింది.

“తుంబురుడే గొప్ప గాయకుడా? నేను కూడా అలా పాడటం నేర్చుకుని విష్ణుమూర్తి దగ్గర సత్కారం పొందుతాను.” అనుకున్నాడు.

అలా నారదుడు కొన్నాళ్ళు సంగీతాన్ని అభ్యసించి విష్ణుమూర్తి దగ్గర గానం చేశాడు. కానీ ఆ గానం తుంబురునిలా శ్రీహరిని సంతృప్తి పరచలేకపోయింది. అయినా నారదుడు తన పట్టు విడువలేదు. ఎలాగైనా తుంబురుని కన్నా బాగా పాడి విష్ణువును ప్రసన్నం చేసుకోవాలనుకున్నాడు.

శివుడు అత్యుత్తమ గాయకుడు కాబట్టి ఆయన అనుగ్రహం సంపాదించి ఆయన దగ్గర సంగీతం నేర్చుకుని మళ్ళీ విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. అయితే ఈసారి కూడా శ్రీహరి ఆయన గానానికి సంతృప్తి చెందలేదు.

అయినా సరే నారదుడు తన సాధన మానలేదు. ఎన్నో సంగీతపరికరాలు పాడైపోయాయి. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా విష్ణుమూర్తిని తన గానంతో ఆకట్టుకోలేక పోతున్నాడు. చివరికి తానిక విష్ణుభగవానుని సంతృప్తి పరచలేనని అర్థమై ఆఖరి అవకాశంగా తుంబురుల వారి దగ్గరకు వెళ్ళి తన్ను శిష్యుడిగా చేర్చుకోమన్నాడు.

తుంబురుడు అందుకు సంతోషంగా అంగీకరించాడు. ఆయన వద్ద శిష్యరికంలో విష్ణువును ఆకట్టుకునేలా ఎలా పాడాలో నేర్చుకున్నాడు. తర్వాత విష్ణువు దగ్గరికి వెళ్ళి అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ నారాయణుని కీర్తించాడు.

ఆ గానానికి ప్రీతి చెందిన విష్ణువు నారదుని కూడా తుంబురుని లాగే సన్మానించి

“ఈ రోజు నీవు నన్ను తుంబురుని కంటే ఆనందింప జేశావు.” అంటూ మెచ్చుకున్నాడు. నారదుడు పరమానంద భరితుడయ్యాడు.

కాబట్టి ఈర్ష్య పడితే ప్రయోజనం లేదు. మనకన్నా ప్రతిభావంతుల దగ్గర నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటేనే విజయం సిద్ధిస్తుంది.

పురందర దాసు కథ

పురందర దాసుపురందర దాసును ఆధునిక కర్ణాటక సంగీతానికి ఆద్యుడు అనవచ్చు. పుట్టుకతో ధనవంతుడూ, పిసినారి అయిన ఆయన పరమ భక్తుడు కావడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఆయన మహారాష్ట్ర లోని పూనా సమీపంలో ఒక పురందరగడ్ అనే కుగ్రామంలో జన్మించాడు. ఇది అప్పట్లో విజయనగర సామ్రాజ్యంలో ఉండేది. ఆయన జన్మనామం శ్రీనివాస నాయక్. వారి పూర్వీకులు వజ్రాల వ్యాపారం చేసే వారు. బాగా కలిగిన కుటుంబం. ఆయన కూడా అదే వ్యాపారంలో ప్రవేశించి బాగా ధనం సంపాదించాడు. ఆయన్ని నవకోటి నారయణుడు అని కూడా అనేవారు. అయితే మొదట్లో చాలా పిసినారిగా ఉండేవాడు. డబ్బు తప్ప వేరే ఆలోచన లేకుండా ఉండేవాడు. ఆయన భార్య పేరు సరస్వతీ భాయి. ఆమె పరమ భక్తురాలు. దయాగుణం కలది.  భర్త లోభ గుణం గురించి తెలిసినా ఏమీ చేయలేకపోయేది.

ఇలా ఉండగా ఒక రోజు ఒక పేద బ్రాహ్మణుడు తన కుమారుడి ఉపనయనం కోసం ధన సహాయం చేయమని శ్రీనివాస నాయక్ దగ్గరకు వచ్చాడు. ఆయన్ని తర్వాత రమ్మంటూ పంపించి వేశాడు. అలా ఆ బ్రాహ్మణుని చాలా రోజులు తన చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నాడు కానీ ధన సహాయం మాత్రం చేయలేదు. ఆ బ్రాహ్మణుడు కూడా పట్టు విడువకుండా అలా తిరుగుతూనే ఉన్నాడు.  ఆరు నెలలు గడిచాయి. చివరకు ఆ బ్రాహ్మణుడిని ఎలాగైనా వదిలించుకోవాలని తన దగ్గరున్న పనికిరాని రాని నాణేలన్నీ ఒక కుప్పగా పోసి అందులో అతనికి నచ్చిన ఒక నాణేన్ని తీసుకుని మళ్ళీ ఎప్పుడూ తిరిగి రావద్దని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు చేసేదేమీ లేక నిరాశతో అక్కడ్నుంచి వెనుదిరిగాడు.

వెళుతూ వెళుతూ సరస్వతి భాయి ధార్మిక గుణం గురించి తెలుసుకొని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆమె భర్త తనను చాలాకాలం తిప్పుకుని చివరకు రిక్త హస్తాలతో ఎలా తిప్పిపంపాడో వివరించాడు. ఆమె ఆ పేద సుబ్రాహ్మణుడి పట్ల తన భర్త ప్రవర్తించిన తీరు విని చాలా బాధ పడింది. ఎలాగైనా ఆ బ్రాహ్మణుడికి సహాయ పడాలనుకుంది. కానీ తన భర్త అనుమతి లేకుండా అతని సొమ్ము చిల్లిగవ్వ కూడా ఇవ్వలేనంది. ఆ బ్రాహ్మణుడు కొద్దిగా ఆలోచించి “అయితే మీకు పుట్టింటి వారు ఇచ్చింది ఏదైనా ఉంటే ఇవ్వండి” అన్నాడు. అప్పుడామె తన ముక్కెర ను తీసి ఆయనకు ఇచ్చింది.

ఆ బ్రాహ్మణుడు అది తీసుకుని నేరుగా శ్రీనివాస నాయక్ దుకాణానికే వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రావద్దన్నా ఎందుకొచ్చావంటూ ఆ బ్రాహ్మణున్ని కోప్పడ్డాడు శ్రీనివాస నాయక్. ఆ బ్రాహ్మణుడు శాంతంగా “అయ్యా! నేను యాచించడానికి రాలేదు. ఇదిగో ఈ ముక్కెర తాకట్టు పెట్టి కొంత ఋణం తీసుకుందామని వచ్చాను” అన్నాడు.

ఆయన ఆ ముక్కెర చూడగానే తన భార్యదేనని గుర్తు పట్టేశాడు. ఆ బ్రాహ్మణుడిని అడిగితే అది ఎవరో దాత ఇచ్చిందని తెలిపాడు. ఆ బ్రాహ్మణుడిని మరలా రేపు రమ్మని, ఆ ముక్కెరను జాగ్రత్తగా ఇనప్పట్టె లో దాచి  ఇల్లు చేరాడు శ్రీనివాస నాయక్. తన భార్యను పిలిచి ముక్కెర ఏదని అడిగాడు. ఆమె పొంతన లేని సమాధానాలు ఇచ్చేసరికి దాన్ని చూపించవలసిందిగా పట్టుబట్టాడు. ఆ పేదబ్రాహ్మణుడికి ఆమే తన ముక్కుపుడక దానం చేసి ఉంటుందని ఆయన అనుమానం.

సరస్వతీ భాయి కి కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లయింది. నిజం చెబితే భర్త తన్ని ఖచ్చితంగా శిక్షిస్తాడని భయపడింది. మరో ప్రత్యామ్నాయం ఆలోచించక ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఒక చిన్న గ్లాసులోకి విషాన్ని ఒంపుకొని నోటి దగ్గరకు తీసుకోబోయింది. ఇక తాగబోతుండగా ఆమెకు ఆ గ్లాసులో ఏదో గల గల మని సవ్వడి వినిపించింది. కిందికి దింపి చూస్తే తను బ్రాహ్మణుడికి దానం చేసిన ముక్కెర కనిపించింది. ఆమె తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆమె హృదయం ఆనందంతో, కృతజ్ఞతతో నిండిపోయింది. తన ఇంట్లోని కృష్ణ విగ్రహం ముందు మోకరిల్లి దాన్ని తీసుకుని వెళ్ళి తన భర్తకు చూపించింది. దాన్ని చూసేసరికి శ్రీనివాస నాయక్ కు మతి పోయినంత పనైంది. అది అచ్చం తాను అంగడిలో దాచి వచ్చిన ముక్కుపుడక లాగే ఉంది.

వెంటనే ధృవీకరించుకోవడానికి తన దుకాణానికి వెళ్ళాడు. తను ఉంచిన చోట చూస్తే ఆ ముక్కుపుడక లేదు. ఆయన మాట పెగల్లేదు. తిరిగి ఇంటికి వెళ్ళి అసలేం జరిగిందో చెప్పమని భార్యను ఒత్తిడి చేశాడు. ఆమె జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించింది. ఇదంతా విన్న ఆయన మనసులో సంక్షోభం చెలరేగింది.

తీవ్ర అంతర్మథనం తర్వాత, ఆ బ్రాహ్మణుడెవరో కాదు, సాక్షాత్తూ ఆ విఠలుడే అని తెలుసుకున్నాడు. గత ఆరు నెలలుగా జరిగిన సంఘటనలన్నీ ఆయన కళ్ళముందు కదలాడాయి. ఆయన పిసినారితనం మీద, ప్రవర్తన మీద ఆయనకే అసహ్యం వేసింది. తన భార్య తన కన్నా అదృష్టవంతురాలని అనిపించింది ఆయనకు. తనకు ధనం మీద ఉన్న వ్యామోహం వల్లనే భగవంతుని ఈ విధంగా కష్ట పెట్టవలసి వచ్చిందని తలంచి  తన దగ్గరున్న సమస్త సంపదలూ భగవంతుని పేర దాన ధర్మాలు చేసేశాడు.

అప్పట్నుంచీ ఆయన శ్రీహరి పరమ భక్తుడయ్యాడు. నవకోటి నారయణుడు, నారాయణ భక్తుడైపోయాడు. బంగారు, వజ్రాల నగలతో అలంకరణతో అలంకరింపబడ్డ చేతులిప్పుడు తంబురను చేతబట్టాయి. వివిధ రకాల బంగారు హారాలతో వెలసిన మెడలో ఇప్పుడు తులసి మాలలు దర్శనమిస్తున్నాయి. తన దగ్గరకు దేహీ అని వచ్చిన అనేక మంచి యాచకులను తిప్పి పంపిన తను ఇప్పుడు ఉదర పోషణార్థం భిక్షమెత్తుతున్నాడు. నలుగురితో పాటు జన్మించి నలుగురితో పాటు మట్టిలో కలిసిపోవాల్సిన శ్రీనివాస నాయక్ పురందర దాసు అయ్యాడు. పుట్టిన కొన్ని శతాబ్దాల తర్వాత కూడా తన కీర్తనల ద్వారా ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ ఉన్నాడు. పరసవేది స్పర్శతో రాయి కూడా బంగారమైనట్లు పరమ లోభి కూడా ఆ భగవంతుని కృపతో హరిదాసులకు ఆది గురువయ్యాడు.

Follow

Get every new post delivered to your Inbox.

Join 27 other followers