కన్ఫ్యూషియస్ సందేశం

క్రీ.పూ 6 వ శతాబ్దంలో చైనాలో జీవించిన ప్రఖ్యాత తత్వజ్ఞుడు కన్ఫ్యూషియస్ మరణ శయ్య మీదున్నాడు. ఆయన చుట్టూ ఆప్తులు, అనుయాయులు గుమికూడారు. అంతా విషాదంలో మునిగి ఉన్నారు. అప్పుడు కన్ఫ్యూషియస్ అతి హీనస్వరంతో

“నా నోట్లో ఏముందో చూసి చెప్పగలరా?” అన్నాడు.

అప్పటికే వయోవృద్ధుడైన ఆయన ఆ తాత్వికుని పళ్ళు ఊడిపోయాయి. కాబట్టి వాళ్ళు,

“అయ్యా మీ నోట్లో నాలుక మాత్రం ఉందండీ ” అని జవాబిచ్చారు.

ఆయన కాసేపాగి “మీ నోట్లో ఏమున్నాయి?” అని అడిగాడు.

“మా నోట్లో పళ్ళు, నాలుకా రెండూ ఉన్నాయండీ” అన్నారు వాళ్ళు తటపటాయించకుండా.

“చూశారా మనిషి పుట్టినపుడు నోట్లో నాలుక మాత్రమే ఉంటుంది. కాలక్రమంలో పళ్ళు మొలుస్తాయి. కానీ అవి నాలుక కన్నా బలంగా, దృఢంగా ఉంటాయి. క్రమంగా మనిషి వృద్ధుడయ్యేసరికి బలమైన పళ్ళు క్రమేణా రాలిపోతాయి. కోమలమైన, సున్నితమైన నాలుక మాత్రమే మరణం వరకు ఉంటుంది.”

ఆయన కాసేపు ఊపిరి తీసుకోవడం ఆగి

“మీ అందరికి ఇదే నా చివరి సందేశం. సున్నితమైనది, సరళమైనది చిరకాలం నిలుస్తుంది. కనుక సదా సరళ ప్రవర్తనులై మెలగండి. ప్రతి ఒక్కరితో ప్రేమగా, సరళంగా మాట్లాడటం అలవర్చుకోండి” అని చెప్పి కన్ను మూశాడు.

*శ్రీరామకృష్ణ ప్రభ సౌజన్యంతో…

4 thoughts on “కన్ఫ్యూషియస్ సందేశం

వ్యాఖ్యలను మూసివేసారు.