జన్మానికో శివరాత్రి!

స్వామి వారి తేరు

స్వామి వారి తేరు

మా ఊరు శ్రీకాళహస్తిలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నా గత రెండేళ్ళుగా నాకు దర్శన భాగ్యం కలుగలేదు. అయితే ఈ సారి ఎలాగైనా తప్పనిసరిగా చూడాలని రెండు రోజులు ఆఫీసుకు సెలవు పెట్టేశా.ఈ ఏడు నాపై శివుని అనుగ్రహం మెండుగా ఉన్నట్లుంది. అనుకున్నట్టే మా అమ్మతో కలిసి వెళ్ళి ప్రాతఃకాలమే దర్శనం చేసుకున్నాను. అలాగే నాకు బాగా ఇష్టమైన ప్రవచనకర్త సామవేదం షణ్ముఖశర్మ గారిచే అనుగ్రహ భాషణం ప్రత్యక్షంగా వినే అదృష్టం కలిగింది. ఆయన శ్రీకాళహస్తీశ్వరుని గురించి, ఆలయాన్ని గురించి చెప్పిన విశేషాలు మరో టపాలో ప్రస్తావిస్తాను.

 

రాత్రి జాగరణ చేసి లింగోద్భవ మూర్తిని దర్శించుకునే భాగ్యం కలిగింది. ఇన్నేళ్ళుగా శ్రీకాళహస్తిలో ఉన్నానన్న పేరే గానీ లింగోద్భవ దర్శనం చేసుకున్నది లేదు. ఎందుకంటే లింగోద్భవ దర్శనం టిక్కెట్టు సంపాదించాలంటే పైరవీలైనా చేయాలి, లేదా ఎవరైనా ఆలయ అధికారులు, ఉద్యోగస్తులతో స్నేహమైనా కలుపుకోవాలి. తీరా టిక్కెట్టు సంపాదించాక ఆ సమయంలో గుడిలో ఎక్కడలేని తొక్కిసలాట ఉంటుంది. ఇలాంటివి మనకు గిట్టవాయే. అంత రద్దీలో దేవుడిమీద భక్తి నిలపాలంటే కష్టమైన పనే. మన పరిస్థితి చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్లు కాకూడదు కదా!

ఈసారి వాటి అవసరమేమీ లేకుండా ప్రశాంతంగా లింగోద్భవ దర్శనం కలిగేలా చేశాడా పరమేశ్వరుడు. ఎలా అంటారా? జాగరణలో భాగంగా ఆలయం పరిసరాల్లో తిరుగాడుతూ శివనామ స్మరణలో ఓలలాడుతూ, ముందుగా అత్యంత వైభవంగా జరిగే నందివాహన సేవలో కాసేపు పాల్గొన్నాను.

శివుడు కళాప్రియుడు కాబట్టి శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ధూర్జటి కళాప్రాంగణము అనే పేరుతో ఒక వేదిక ఏర్పాటు చేస్తారు. ఈ వేదికపైన రాష్ట్రం నలుమూలలనుండీ, ఇతర రాష్ట్రాల నుండీ వచ్చిన అనేక మంది కళాకారులచే భక్తిరంజని, నృత్య, గాన, నాటక కళా రూపాలు ప్రదర్శింపబడుతూ ఉంటాయి. ఈసారి ప్రధాన ఆకర్షణ ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో భక్తివిభావరి. ఇప్పటి దాకా ఇలాంటి భక్తి కార్యక్రమం చేయడం తమన్ కు ఇదే ప్రథమమట. అయితే కాసేపు విన్న తర్వాత ఆయన సినిమాల్లోపాటల్లో లాగా వాయిద్యాల హోరు ఎక్కువై గాత్రం సరిగా వినపడకపోవడంతో అక్కడ నుంచి వచ్చేశాను. ఆ కార్యక్రమం పది గంటలకు అయిపోయింది.

మరో నాటకం ప్రారంభమైంది. ఆ వేదిక వద్దకు వచ్చి కాసేపు ఉన్నాను. అక్కడ కొంచెం రద్దీ ఎక్కువ కావడంతో అలా ముందుకు వెళ్ళి ప్రధాన ఆలయానికి ఉత్తర దిక్కుగా శిథిలావస్థలో ఉన్న మణికంఠేశ్వర ఆలయ ప్రాంగణం లోపలికి వెళ్ళి కూర్చున్నాను. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది అనుకుంటూ ఉండగా కాసేపటి తర్వాత కొంచెం దూరంలో చిన్నగా మంత్రాలు వినిపించాయి. అటు వైపు వెళ్ళి చూస్తే ఒక చిన్న భక్త బృందం, పంతులుగారితో కలిసి ఆ శిథిలాలయల్లో పూజలు నిర్వహిస్తున్నారు. శివరాత్రి రోజు ప్రతి శివలింగంలోనూ శివుడు ప్రవేశిస్తాడని ప్రతీతి. అందుకని పూజ అయిపోయే దాకా అక్కడే కూచున్నాను. సాధారణంగా శివలింగం ఉన్న గర్భగుడికి వెనుక వైపుగా లింగోద్భవ మూర్తి ఉంటుంది. అలా వెనక్కి వెళ్ళి చూస్తే కొంచెం చీకటిగా ఉంది. అక్కడ ఎవరూ లేరు. సెల్‌ఫోన్ వెలుతురులో పరికించి చూస్తే అది సాక్షాత్తూ లింగోద్భవ మూర్తే! ఇన్నాళ్ళూ గుడికి వెళ్ళి వస్తున్నా నేను ఎప్పుడూ అది గమనించింది లేదు. అక్కడ అలా దర్శనం చేసుకుని సంతృప్తిగా ఇంటిదారి పట్టాను.

ఈ శివరాత్రి నాకు మరపురాని అనుభూతిని మిగిల్చింది. నాకు తెలియకుండానే ఎవరో నడిపిస్తున్నట్లుగా ఆ గుడికి వెళ్ళడం, లింగోద్భవ సమయంలో సంతృప్తిగా స్వామి వారి అభిషేకాన్ని దగ్గరుండి దర్శించుకోవడం, జన్మానికో శివరాత్రి అంటే ఇదేనేమో అనిపించింది.

బెంగుళూరు జీవితం కొన్ని అనుభవాలు

బెంగుళూరుకు వచ్చి దాదాపు మూడు నెలలవుతోంది. నాకు ఎదురైన అనుభవాలతో ఓ టపా వేద్దామంటే ఇప్పటికి కుదిరింది. భాష చాలా వరకు సమస్య కాలేదు. అచ్చ కన్నడిగుడైనా తెలుగులో సహాయం అడీగితే తెలిసీ తెలియని తెలుగులో అయినా సమాధానం చెప్తారు. హైదరాబాదులో ఆటో డ్రైవర్లు కొంతమంది తెలుగు తెలిసినా హిందీ లోనే మాట్లాడేవారు కొన్ని చోట్ల. కానీ ఆటో చార్జీలు బాగా ఎక్కువ. షేరింగ్ ఆటోలు ఎక్కడా కనిపించవు. బెంగుళూరు కన్నడ దేశమే అయినా అందులో ప్రాంతీయులు కేవలం 24% మాత్రమేనట. మిగిలిన వారిలో 20% తమిళులు, 16% తెలుగు వాళ్ళు, 12% మలయాళీలు, 12% మిగతా భారతీయులు, 9% యూరోపియన్లు ఉన్నారట.

హైదరాబాదు నుంచి ఇక్కడికి రాగానే తేడా తెలిసింది అక్కడికన్నా కొంచెం ఇరుకైన రోడ్లు. కానీ ట్రాఫిక్ లో వాహన చోదకులకు కొంచెం క్రమశిక్షణ ఉందిక్కడ. కొద్దిసేపాగితే ఎంతో కొంత ముందుకు సాగుతుందని కొద్ది ఆశ ఉంటుంది. హైదరాబాదు లో అలా కాదు. ఒక్కోసారి ట్రాఫిక్ లో ఇరుక్కుపోతే వాహనం దిగి నడిచి వెళ్ళిపోతే తొందరగా గమ్యస్థానం చేరుకోవచ్చు.

బస్సుల్లో రద్దీ అక్కడా ఇక్కడా దాదాపు ఒకటే కాకపోతే ఇక్కడ ఏసీ బస్సులు చాలా ఎక్కువ. బస్సుల ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువే. దగ్గర స్టాప్ లకైతే కండక్టర్లు చిల్లర తీసుకుని టిక్కెట్టివ్వకుండా నింపాదిగా వెళ్ళిపోతుంటారు. ఈ విషయంలో హైదరాబాదు కండక్టర్లు చాలా నిజాయితీపరులేమో. హైదరబాదులో నేనున్న మూడేళ్ళలో అలాంటి అనుభవం నాకెప్పుడూ ఎదురు కాలేదు.

ఇక పోతే ఈ మధ్యనే ఓ మెయిల్లో చదివాను. బెంగుళూరు లో మూడు విషయాలకు బాగా పేరు గాంచిందట. ఒకటి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, రెండు అమ్మాయిలు, మూడు కుక్కలు. అలాంటిదే మా స్నేహితుడు కూడా మరో విషయం చెప్పాడు. ఇక్కడ ఓ రాయి పైకి విసిరితే అది ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మీదన్నా పడుతుందంట లేదా ఒక కుక్క మీదన్నా పడుతుందంట!.

ఇంటి అద్దెలు హైదరాబాదు కన్నా కొంచెం ఎక్కువే. నాకు మా కొత్త ఆఫీసు సహోద్యోగుల సహాయంతో కాస్త తక్కువ అద్దెకే ఇల్లు దొరికింది. ఆఫీసుకు చాలా దగ్గర. ఎంత దగ్గరంటే రోజూ మధ్యాహ్నం ఇంటికెళ్ళి భోంచేసి వస్తుంటాను. బెంగుళూరు రాగానే ఎప్పుడూ మన దగ్గర ఉంచుకోవాల్సింది ఓ గొడుగు. వాన మనల్ని ఎప్పుడు పలకరిస్తుందో తెలియదు. వాన వస్తుందని బయటికి వెళ్ళడం వాయిదా వేసుకున్నారంటే అసలు బయటికి వెళ్ళలేం. మెట్రో పనుల వల్ల చాలా చోట్ల ట్రాఫిక్ మందకొడిగా సాగుతూ ఉంటుంది. కొన్ని చోట్ల రోడ్లంతా బురదమయం.

ఇకపోతే ఈ ఆదివారం ఈనాడు పుస్తకంలో చదివాను. మన హైదరాబాదులో మెట్రో కేవలం నాలుగేళ్ళలోనే పూర్తి చేస్తామని ఎల్ అండ్ టీ వాళ్ళు అన్నారట. ఎంతవరకు సాధ్యమో నాకు తెలియదు. ఇక్కడ నాలుగేళ్ళ ముందే ప్రారంభించినా కేవలం ఏడు కిలోమీటర్లు మాత్రమే సాధ్యమైందట. అదే జరిగితే బెంగుళూరుకన్నా హైదరాబాదు ప్రజా రవాణా వ్యవస్థ ఖచ్చితంగా మెరుగవుతుంది.

షాపింగ్ విషయానికొస్తే మన హైదరాబాదులోని కోఠీ, సుల్తాన్ బజార్, బేగంబజార్ ను పోలిన ప్రదేశం ఒకటుంది. అదే శివాజీ నగర్ కు దగ్గర్లో ఉన్న కమర్షియల్ స్ట్రీట్. గత శనివారం అక్కడికి వెళ్ళినప్పుడైతే అచ్చం హైదరాబాదులో తిరుగాడుతున్నట్లే అనిపించింది.

బండి సవారీ

అవి నేను మూడో తరగతి చదువుతున్న రోజులు. దసరా సెలవులిచ్చారు. అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలంటే బలే కుశాల నాకు.

సరిగ్గ అప్పుడే వానాకాలం. వానాకాలమొస్తే మా ఊరికి బస్సులుండవు. ఎందుకంటే మా ఊరికీ కాళహస్తికీ మధ్య ఓ చిన్న ఏరు అడ్డం. వానలకి అది రోడ్డు మీదకి పొంగి పొర్లుతుంది. బస్సులు సెలవు తీసుకుంటాయి. వానలు తగ్గినా దానిమీద కట్టుండే చిన్న వంతెన (సప్పెట అంటారు) కొట్టుకు పోతుంది. దాన్ని తిరిగి బాగు చేసేదాకా మాకు బస్సులుండవు.

మరి అమ్మమ్మోళ్ళ ఊరికి పోవాలంటే కాలినడకే గతి. చెట్లెంబట, పుట్లెంబట అడ్డం దొక్కోని పోవడమే. కొద్ది దూరం రోడ్డు మీద వెళితే బండి బాట మాత్రం ఉండేది.

అదృష్టవశాత్తూ అప్పుడే మా చిన్నాన్న, మా మామతో కలిసి  మా అమ్మమ్మ వాళ్ళకి తుమ్మ కట్టెలు (వంటకి వాడేందుకు) ఎడ్ల బండి మీద వేసుకుని వెళుతున్నాడు.

మా అమ్మేమో బండి మీద ప్రయాణం వద్దనింది. నేను మాత్రం వెళ్లాల్సిందేనంటూ మారాం చేశాను. అమ్మ ఒప్పుకోక తప్పింది కాదు.

ప్రయాణం మొదలైంది. బండి నిండా ఎత్తుగా కట్టెలు పేర్చారు. కట్టెల పైన  ఓ తుండుగుడ్డ పరిచి నన్నక్కడ కూర్చోబెట్టారు.

మా చిన్నాన్న బండి నొగ  మీద కూర్చుంటే మా మామ బండి వెనకాలే నడుస్తూ వస్తున్నాడు. ఉదయపు నీరెండలో నెమ్మదిగా సాగుతోంది మా ప్రయాణం. కట్టెల బరువుకు మెత్తటి బండి బాటలో నింపాదిగా అడుగులు వేస్తూ కదులుతున్నాయి ఎద్దులు.

కొద్ది దూరం వెళ్ళగానే బండి తారు రోడ్డు మీదకు ఎక్కింది. లాగడం సులభం కావడంతో ఎద్దులు నెమ్మదిగా వేగం పుంజుకున్నాయి.

మరి కొంచెం దూరం వెళ్ళగానే తారు రోడ్డు దిగి మళ్ళీ బండి బాటలోకి వెళ్ళాల్సి వచ్చింది. అప్పటి దాకా సులభంగా లాక్కొచ్చేస్తున్న ఎద్దులు మళ్ళీ గతుకుల బండి బాటలోకి దిగాలనేసరికి మొరాయించడం మొదలు పెట్టాయి.

“ప ప్పా… డిర్ర్ ” గట్టిగా అదిలించాడు మా చిన్నాన్న. ఉహూ కదల్లేదు. ముల్లుగర్ర తో పొడిచాడు. కొంచెం చలనం వచ్చింది. ఎలపటి ఎద్దుని మా చిన్నాన్న, దాపటి ఎద్దుని మా మామ తోక పట్టి గట్టిగా మెలేశారు.

ఉన్నట్టుండి అకస్మాత్తుగా పక్కకు తిరిగాయి ఎద్దులు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే బండి నెమ్మదిగా వాలి తిరగబడింది! ఎద్దులు పక్కకు తప్పుకున్నాయి.

ముందు నేను, నా పైన కట్టెల మోపులు, దాని పైన బండి! మా చిన్నాన్న కి, మామ కి ఏం చేయాలో పాలుపోలేదు.

ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి నా తల భాగం, భుజాలు బయటికి కనిపిస్తూ ఉన్నాయి. చెరో చెయ్యి పట్టుకుని నెమ్మదిగా బయటికి లాగారు.

చిన్నతనంలో సహజంగా కనిపించే భయం నా మొహంలో ఏ మాత్రం  కనిపించలేదు. అంతకంటే విచిత్రమైన విషయం నా ఒంటిమీద ఎక్కడా ఒక్క గాయం కానీ, రక్తం కానీ కనిపించలేదు. శరీరం లో ఏ భాగంలో కూడా చిన్న నొప్పి కూడా తెలియలేదు.

“హమ్మయ్య ఏ దేవుడో మనందుణ్యాడు బో…” వాళ్ళిద్దరూ సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. ఇంక నన్ను పక్కన కూర్చోమని ఒక అర్ధ గంటలో వాళ్ళిద్దరూ కొన్ని మోపులు దీసి పక్కనేసి బండి పై కెత్తి మళ్ళీ నింపేసినారు.

ఆ సంఘటన వల్ల షాక్ తోననుకుంటా మిగతా ప్రయాణమంతా మేం పెద్దగా మాట్లాడుకోనేలేదు. పైకి కనిపించలేదు గానీ వాళ్ళిద్దరూ లోలోన చాలా భయపడిపోయారు. ఎందుకంటే మా అమ్మనాన్నలకి నేను లేక లేక కలిగిన కొడుకుని. ఏమన్నా అయ్యుంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అని తెగ ఆలోచనలో పడిపోయామని నాకు తరువాత చెప్పారు. ఈ సంఘటన చాలా రోజుల వరకు మా ముగ్గురి మధ్యనే ఉండిపోయింది.

తర్వాత ఒక రోజు నేనే అందరికీ చెప్పేశాను. ఆశ్చర్యపోవడం వారి వంతైంది.

మా అమ్మ, అమ్మమ్మ మాత్రం “మనం నమ్ముకున్న దైవం మనల్ని సదా కాపాడుతూ ఉంటుంది నాయనా, కాబట్టి ఎప్పుడు నీకు కష్టకాలం వచ్చినా భగవంతుణ్ణి తలుచుకో. నీకు ప్రశాంతత చేకూరుతుంది” అనే జీవిత సత్యాన్ని తెలియజేశారు.

మనసును దోచే మున్నార్

“మీ సాఫ్ట్‌వేరోళ్ళు ఎప్పుడూ ఇంతేనంటగా. మా ఫ్రెండ్ చెప్పింది. పట్టుమని పది రోజులు కూడా ఇంటి దగ్గర ఉండరట. ఎప్పుడు చూసినా ఆఫీసు, పనులు అంటూ ఉంటారంట. ఇంక మన హనీమూన్ అయినట్టేలే” పెళ్ళికి తీసుకున్న మూడు వారాల సెలవులు అయిపోయి నేను తిరిగి హైదరాబాద్ వచ్చేస్తుండగా మా శ్రీమతి నాపై విసిరిన విసుర్లు.

“నీకెందుకు? ఈ డిసెంబర్ లోపల హనీమూన్ నేను ప్లాన్ చేస్తాగా” అని అభయమిచ్చి  వచ్చేశాను.

ఆ సమయం రానే వచ్చింది. ఈ నెల దీపావళికి ముందు మూడు రోజులు సెలవు పెడితే మొత్తం తొమ్మిది రోజులు సెలవులు కలిసొచ్చాయి. వీటిలో ఓ ఐదు రోజులు మున్నార్ లో, నాలుగు రోజులు దీపావళికి ఇంట్లోను ఉండేలా పథకం వేసుకున్నా.

ముందుగా హైదరాబాద్ నుంచి మా ఊరు శ్రీకాళహస్తికి వెళ్ళి, అక్కడ నుంచి మా ఆవిడని తీసుకుని రేణిగుంట నుంచి ఎర్నాకుళం దాకా దాదాపు పదమూడు గంటలపాటు రైలు ప్రయాణం. ఎర్నాకుళం లో బీటెక్ లో మా లెక్చరర్ జయరాం గారు మాకు అక్కడే ఓ హోటల్లో బస, అక్కడ నుంచి అతిరిపల్లి జలపాతం చూసేందుకు ఓ కారు ఏర్పాటు చేశారు. ఈ జలపాతం దగ్గర చాలా సినిమా షూటింగులు కూడా జరిగాయట. చాలా ఎత్తైన జలపాతం. పాల నురగ లాంటి స్వచ్చమైన నీరు పై నుంచి అలా జాలువారుతుంటే చూడ్డానికి రెండు కళ్ళూ చాలవంటే నమ్మండి. బాగా ఎత్తైన ప్రదేశం నుంచి ఎక్కువ నీళ్ళు కింద పడటం వల్ల తుంపర్లు చాలా దూరం వరకూ పడుతూ ఉంటాయి. లెన్స్  మీద నీళ్ళు పడకుండా ఉండాలంటే కొంచెం దూరం నుంచే ఫోటోలు తీయాలి.


కమల్ హాసన్ సినిమా డ్యాన్స్ మాస్టర్ లో మొదట హీరో, హీరోయిన్లు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తారు. అది ఇక్కడే చిత్రీకరించారు. ఇటీవల సినిమా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ చిత్రంలో ‘మన్మథుడే బ్రహ్మను పూని‘ అనే పాటలో కొంత భాగం కూడా ఇక్కడే చిత్రీకరించారు.

అక్కడి నుంచి సాయంత్రానికి మళ్ళీ ఎర్నాకుళం తిరిగొచ్చేసి మరుసటి రోజు మున్నార్ కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అప్పుడే మరుసటి రోజుకు మున్నార్ లో ఓ హోటల్ కూడా బుక్ చేసుకున్నాం. రాత్రి అక్కడే పడుకుని మరుసటి రోజు మున్నార్ కు కేరళ ఆర్టీసీ బస్సులో ప్రయాణం. ఎర్నాకుళం నుంచి మున్నార్ కు ప్రతి అర్ధ గంటకూ ఓ బస్సుంది. మొత్తం నాలుగున్నర గంటల ప్రయాణం. చాలా వరకు ఘాట్ రోడ్డు ప్రయాణమే. చల్లటి వాతావరణం. అంబరాన్ని చుంబిస్తున్నట్లుండే పర్వత శిఖరాలు, వాటితో పోటీ పడుతూ మబ్బుల్లోకి దూసుకెళ్ళినట్లనిపించే చెట్లు  చూసేవారికి కనువిందు కలిగించక మానవు.

మున్నార్ సుందర దృశ్యాలు వీక్షించాలంటే అక్కడి నుంచి మూడు మార్గాలున్నాయి. ఒకటి ఎర్నాకుళం వైపు, రెండోది కొడైకెనాల్ వైపు(సుమారు 60 కి.మీ), మూడోది కోయంబత్తూర్ వైపు. ప్రసిద్ధి చెందిన ప్రదేశాలన్నీ ఈ మార్గాల్లోనే  ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యమైన దక్షిణభారతదేశంలోనే ఎత్తైన పర్వతశిఖరం అనైముడి కోయంబత్తూర్ వెళ్ళే మార్గంలో వస్తుంది.


మున్నార్ లో ఎటు చూసినా పచ్చదనమే. వీటిలో తొంభై శాతం టాటా వారి ఆధ్వర్యంలో నడిచే తేయాకు, కాఫీ తోటలే. మేం చూసిన ముఖ్యమైన ప్రదేశాలు పోతంబేడు వ్యూ పాయింట్, మాటుపెట్టై డ్యామ్, ఏనుగులు వచ్చే చోటు, కుండేల్ సరస్సు, టాప్ స్టేషన్, లక్కోం జలపాతం, బ్లాసమ్ పార్క్. కోయంబత్తూర్ కు వెళ్లే దారిలో ఎర్రచందనం అడవులు, వెదురు చెట్లు, వన్యమృగాలు దర్శనమిస్తాయి. మున్నార్ లో సాధారణంగా ఎప్పుడూ బాగా వర్షాలు పడుతుంటాయట. కానీ మేం వెళ్ళిన రెండు రోజులూ అదృష్టవశాత్తూ వర్షం ఏమీ పడలేదు. వాతావరణం కూడా పెద్దగా చలిగా లేకుండా ఆహ్లాదకరంగా ఉంది.

మున్నార్ నుంచి కారు అద్దెకు తీసుకోవాలంటే ఖర్చు అనుకునేవారు సెవెన్ సీటర్ ఆటోలు, జీపులు కూడా అద్దెకు మాట్లాడుకోవచ్చు. మొదటి రోజు కొచ్చిన్ వైపు వెళ్లేదారిలో ప్రదేశాలు చూశాం. రెండో రోజు కొడైకెనాల్ దారిలో వచ్చే ప్రదేశాల్ని కవర్ చేశాం. మూడోరోజు సాయంత్రం కోయంబత్తూర్ లో మేం కోయంబత్తూర్ లో రైలు ఎక్కాల్సి ఉంది. ఉదయాన్నే హోటల్ ఖాళీ చేసేసి కోయంబత్తూర్ వైపు వెళుతూ దారిలో చూడాల్సిన ప్రదేశాలు కవర్ చేసేశాం.

అప్పటి దాకా కేరళ God’s own country గా వినడమే కాక చూసింది లేదు. అలాంటి ప్రదేశానికి మేమిద్దరం మొదటి సారి కలిసి వెళ్ళడం మా ఇద్దరికీ మరిచిపోలేని అనుభూతి మిగిల్చింది.


Follow

Get every new post delivered to your Inbox.

Join 30 other followers