సత్సంగం గొప్పతనం

ఒకసారి నారద మహర్షి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి “సత్సంగం యొక్క గొప్పతనం ఏమిట”ని అడిగాడు.

శ్రీకృష్ణుడు వెంటనే ఒక పురుగు ను చూపించి దాన్ని అడగమన్నాడు. నారదుడు అలాగే వెళ్ళి ఆ పురుగుని “సత్సంగం వల్ల ఫలం ఏమిట”ని అడిగాడు. అలా అడగ్గానే ఆ పురుగు నారదుల వైపు ఒక్కసారి చూసి టక్కున చచ్చిపోయింది.

నారదుడు మళ్ళీ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి “స్వామీ, ఆ పురుగు సమాధానం చెప్పేలోపే చనిపోయింది. ” అన్నాడు.

శ్రీకృష్ణుడు అప్పుడే పుట్టిన ఓ చిలుకను చూపించి దాన్ని అడగమన్నాడు. నారదుడు ఆ చిట్టి చిలుకను అదే ప్రశ్న అడిగాడు. అది కూడా నారదుడి వైపు తేరిపార చూసి వెంటనే ప్రాణాలు విడిచింది.

నారదుడికి బాధ కలిగింది. మళ్ళీ శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళాడు. “స్వామీ! మీరే సమాధానం చెప్పండి.” అని అడిగాడు.

ఆయన ఈసారి “అయితే ఈ సారి ఇప్పుడే పుట్టిన ఆ లేగ దూడను అడుగు” అన్నాడు.

నారదుడు ఈ సారి భయం భయంగా ఆ దూడ దగ్గరకు వెళ్ళి అదే ప్రశ్నను అడిగాడు. అది కూడా వెంటనే మరణించింది.

మూడు జీవాల మరణం నారదుణ్ణి బాగా కలచి వేసింది.

మళ్ళా శ్రీకృష్ణుని దగ్గరకెళ్ళి “హే కృష్ణా! ఏమిటయ్యా నాకీ పరీక్ష!!” అన్నాడు .

ఆయన ఈ సారి నారదుణ్ణి ఒక రాజభవనం లోకి వెళ్ళి అప్పుడే పుట్టిన రాజకుమారుణ్ణి అడగ మన్నాడు. ఈసారి రాజ కుమారుడు మరణించడని కూడా అభయమిచ్చాడు.

నారదుడు అలాగే రాజభవనం లోకి వెళ్ళి అప్పుడే పుట్టిన పసికందు రాజకుమారుణ్ణి అదే ప్రశ్న వేశాడు.

“ఓ నారద మునీంద్రా! సత్సంగ మహిమ మీకింకా అర్థం కాలేదా? మీరు నన్ను మొదట ప్రశ్నించినపుడు నేను ఓ పురుగుని. మీ దర్శన భాగ్యం చేత రెండో సారి చిలుకనై పుట్టాను. మీరు వచ్చి మళ్ళీ నన్ను అడిగారు. అప్పుడు నేను లేగదూడ జన్మనెత్తాను. మీరు మూడో సారి వచ్చి కూడా నన్ను అడగడం వల్ల పరమోత్కృష్టమైన మానవ జన్మ లభించింది.కేవలం సాధు పుంగవులైన మీ దర్శన భాగ్యంచేతనే నాకింతటి అదృష్టం ప్రాప్తించింది” అన్నాడు నవ్వుతూ.

జై శ్రీకృష్ణ!!

Follow

Get every new post delivered to your Inbox.

Join 30 other followers